Man Climbs Gopuram: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఓ వ్యక్తి హల్ చల్ చేయడంతో తీవ్ర కలకలం రేగింది. ఆ వ్యక్తి ఆలయ గోపురం పైకి ఎక్కడంతో కొద్దిసేపు హైడ్రామా నడిచింది. వెంటనే స్పందించిన అధికారులు అతన్ని కిందకు దించడంతో ఘటన సద్దుమణిగింది. శుక్రవారం రాత్రి నిజామాబాద్కు చెందిన ‘తిరుపతి’ అనే వ్యక్తి ఇతర భక్తులతో కలిసి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోకి ప్రవేశించాడని అధికారులు తెలిపారు. అతను గోపురం మార్గం ద్వారా పైకి వెళ్లడాన్ని గమనించిన విజిలెన్స్ సిబ్బంది, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సిబ్బంది అతన్ని కిందకు తీసుకొచ్చి, కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. గోపురం కలశాన్ని పగలగొట్టారన్న వార్తల్లో నిజం లేదని టిటిడి స్పష్టం చేసింది.
తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో జరిగిన ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన ఆలయం మూసివేసే సమయంలో జరిగినట్లు తెలుస్తోంది. భద్రతా సిబ్బంది కళ్లుగప్పి సదరు వ్యక్తి ఆలయంలోకి ప్రవేశించినట్లు సమాచారం. అతను ఆలయం లోపల ఉన్న గోపురం పైకి ఎక్కి కలశాలను పగలగొట్టేందుకు ప్రయత్నించాడని తెలుస్తోంది.
అయితే, సదరు వ్యక్తి చేసిన డిమాండ్ వింటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. తనకు ‘క్వార్టర్ మందు బాటిల్’ ఇస్తేనే గోపురం పైనుంచి కిందకు దిగుతానంటూ హల్ చల్ చేసినట్లు తెలిసింది. వెంటనే సమాచారం అందుకున్న తిరుపతి పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ఆ వ్యక్తిని కిందకు దించేందుకు సుమారు మూడు గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. చివరకు అతన్ని కిందకు దించి, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అతను మద్యం మత్తులోనే ఆలయంలోకి ప్రవేశించాడని పోలీసులు తెలిపారు. ఏకాంత సేవ సమయంలో విజిలెన్స్ సిబ్బంది కళ్లుగప్పి అతను లోపలికి వెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. తనను పట్టుకునేందుకు ప్రయత్నిస్తే పైనుంచి దూకుతానని లేదా కలశాన్ని పగులగొడతానని బెదిరించినట్లు తెలుస్తోంది.
సదరు వ్యక్తిని తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా కూర్మవాడలోని పెద్దమల్లారెడ్డి కాలనీకి చెందిన ‘తిరుపతి’గా అధికారులు గుర్తించారు. తాను గోపురం పైకి ఎక్కి మద్యం కావాలని డిమాండ్ చేసినట్లు విచారణలో తిరుపతి అంగీకరించాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటికే టిటిడి కూడా స్పందించింది.
Read Also: నారా కుటుంబానికి గాలి ద్రోహం చేశాడా! బళ్లారి చరిత్ర ఇదే..