Banana Rate Fact Check: ‘హలో ఇండియా, ఆంధ్రప్రదేశ్ వైపు ఒక్కసారి చూడండి. ఒక కిలో అరటిపండ్లు కేవలం 50 పైసలు మాత్రమే! అవును, మీరు విన్నది నిజమే. ఆంధ్రప్రదేశ్లో అరటి రైతులు పడుతున్న కష్టాలు ఇవి’ అంటూ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై ఫ్యాక్ట్ చెక్ ఏపీ వాస్తవాలు బయటపెట్టింది.
కిలో అరటిపండ్లు కేవలం 50 పైసలకు మాత్రమే అమ్ముడు అవుతున్నాయి అంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ ట్విట్టర్ ఖాతాలో చేసిన ఆరోపణలు అవాస్తమని ఫ్యాక్ట్ చెక్ ఏపీ స్పష్టం చేసింది. అక్టోబర్ లో అరటి సీజన్ ప్రారంభం కాగానే టన్ను రూ.12 వేల నుంచి రూ.14 వేల వరకూ అమ్ముడయ్యాయని పేర్కొంది. నవంబర్ మొదటి వారంలో ఏ గ్రేడు అరటి పండ్లు రూ.7 వేలు, బి గ్రేడ్ రూ.4 వేలు, సి గ్రేడ్ రూ.3వేలకు అమ్ముడు పోయాయని తెలిపింది. నవంబర్ రెండో వారంలో అవే ధరలు నిలకడగా కొనసాగాయని తెలిపింది.
‘నవంబర్ మూడో వారంలో ఏ గ్రేడు రూ.8 వేలు, బీ గ్రేడు రూ.4 వేలు, సీ గ్రేడు రూ.3 వేలకు అమ్ముడుపోయాయి. నాలుగో వారంలో ఏ గ్రేడు రూ.8 వేల నుంచి రూ.10 వేలకు పెరిగింది. బీ గ్రేడు రూ.6 వేల నుంచి రూ 8 వేలకు, సీ గ్రేడు రూ. 4 వేల నుంచి రూ.6 వేల వరకు అమ్ముడు పోయాయి. అనంతపురం, సత్యసాయి, కడప, నంద్యాల జిల్లాల్లో 34,000 హెక్టార్లలో అరటి పంట వేయగా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అత్యధిక వర్షాలు కురవడంతో చాలా వరకు అరటి పంట దెబ్బతిన్నది. అయితే పంటల పరిస్థితిని ముందుగానే అంచనా వేసినందున ట్రేడర్లు, ఎగుమతిదారులతో అరటి పంట పండే అన్ని జిల్లాలలో జిల్లా కలెక్టర్లు సమావేశాలు ఏర్పాటు చేసి తగిన ఆదేశాలు ఇచ్చారు. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ మార్కెట్ లో కూడా ఇలాంటి సమావేశాలే ఏర్పాటు చేశారు’ అని ఫ్యాక్ట్ చెక్ ఏపీ తెలిపింది.
‘హర్యానాలోని శీతల గిడ్డంగుల వారితో మాట్లాడారు. ఫలితంగా ఉత్తర భారత దేశంలోని కొనుగోలు దారులు ఆంధ్రప్రదేశ్ లో పండిన అరటి కొనుగోలు ప్రారంభించారు. కడప, అనంతపురం జిల్లాల నుంచి 700 మెట్రిక్ టన్నుల అరటిని ఉత్తర భారతదేశంలోకి పంపి అక్కడ విక్రయించారు. గత వారం రోజులుగా మెట్రిక్ టన్నుకు రూ 2 వేల నుంచి రూ.4 వేలు పెరిగింది. అరటి రైతులకు రవాణా రాయితీ ఇవ్వాల్సిందిగా భారతీయ రైల్వేను ప్రభుత్వం కోరింది. డిసెంబర్ 2వ వారం నుంచి అరటి ధర మరింత పెరిగే అవకాశం ఉంది. వాస్తవాలు ఇలా ఉండగా రైతులలో నిరాశ నింపే విధంగా ప్రకటనలు చేయడం సబబు కాదు. రైతు సోదరులు కూడా వాస్తవాలు గ్రహించి ఇలాంటి ప్రచారాలను నమ్మొద్దని’ ఫ్యాక్ట్ చెక్ ఏపీ కోరింది.
ఏపీలో కిలో అరటిపండ్లు 50 పైసలు..ఒక అగ్గిపెట్టెకన్నా, ఒక్క బిస్కెట్ కన్నా చవకగా అరటి పండ్లు లభిస్తున్నాయని వైఎస్ జగన్ ఆరోపించారు. లక్షల రూపాయలు పెట్టి, నెలల తరబడి కష్టపడి సాగు చేసే రైతులకు ఇలాంటి ధర రావడం కన్నీళ్లు తెప్పించే విషయమే అన్నారు. అరటి మాత్రమే కాదు ఉల్లి నుంచి టమోటా వరకూ, ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదని జగన్ ఆరోపించారు. విపత్తుల సమయంలో ఉచిత పంట బీమా లేదని, ఇన్పుట్ సబ్సిడీలు లేవని, పెట్టుబడి సహాయం కింద చేసిన హామీలు.. ఇవన్నీ కూడా మోసాలేనని విమర్శించారు.
Also Read: AP Helicopter Politics: జగన్ విహారయాత్రకు రూ.222 కోట్ల ఖర్చు.. నిజం బయటపడిందంటూ మంత్రి లోకేష్ కౌంటర్
వైసీపీ పాలనలో, టన్ను అరటికి సగటున రూ. 25,000 ధర లభించిందన్నారు. రేట్లు తగ్గిపోయిన పక్షంలో రైతులు నష్టపోకుండా ప్రత్యేక రైళ్లు నేరుగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వరకు నడిపించామన్నారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా కోల్డ్ స్టోరేజ్లు నిర్మించామని, దీనివల్ల లక్షలాది రైతుల కుటుంబాలను ఆదుకున్నామని స్పష్టం చేశారు. కానీ నేడు వ్యవసాయం కూలిపోతుంటే, రైతులు నష్టాల్లో మునిగిపోతుంటే సీఎం చంద్రబాబు చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. కిలో అరటిపండ్లు 50 పైసలైతే…ఆ ఆహారాన్ని పండించే రైతుల శ్రమకు కట్టే విలువ ఎంత? అంటూ ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు.