Fake liquor In AP: ఏపీలో నకిలీ మద్యం కేసు వైసీపీ నేతలకు చెమటలు పడుతున్నాయా? ప్రతీ నియోజకవర్గంలో నకిలీ మద్యం తయారు చేస్తున్నారా? ఇప్పటికే అరెస్టయిన నిందితుల నుంచి ఎలాంటి సమాచారం సేకరించారు? సిట్ రంగంలోకి దిగితే వైసీపీలో సగం నేతలు పనైపోయినట్టేనా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
వైసీపీలో నకిలీ మద్యం వణుకు
ములకల చెరువు నకిలీ మద్యం వెలుగులోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలు సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు. దీనివెనుక కూటమి ప్రభుత్వం ఉందన్నది ఆ పార్టీ నేతల వాదన. ప్రతీ నియోజకవర్గంలో ఇలాంటివి ఉన్నాయని ఆరోపించారు. దొరికిన వ్యక్తి టీడీపీ నుంచి పోటీ చేశారని, ఆయన అఫిడవిట్ పత్రాలు ఆదివారం మీడియా ముందుపెట్టారు మాజీ మంత్రి రోజా. సీబీఐ చేత విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.
అంతేకాదు ప్రతీరోజూ మూడు పూటలా నేతలు దీనిపై ప్రెస్మీట్లు పెట్టి ఓ రేంజ్లో హంగామా చేయడం మొదలుపెట్టారు. ఇంతకీ సీబీఐ చేత విచారణ చేయించాలని రోజుకో నేత ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? సీబీఐతో అయితే కేసు నుంచి తప్పించుకోవడానికేనా? అవుననే సంకేతాలు అంటున్నారు టీడీపీ నేతలు.
సిట్ దిగితే నేతల అరెస్టు తప్పదా?
ఈ వ్యవహారంపై ఆదివారం రాత్రి మీడియా ముందుకొచ్చారు సీఎం చంద్రబాబు. నకిలీ మద్యం కేసులో తవ్వేకొద్దీ విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయని అన్నారు. ఈ కుంభకోణాన్ని పక్కదాని పట్టించేందుకు వైసీపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. దీనిపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు చేస్తుందని చెప్పుకొచ్చారు. వివిధ విభాగాలకు చెందిన నలుగురు అధికారులతో కలిసి సిట్ వేశారు.
ఈ తరహా వ్యవహారాలు ఎక్కడున్నా సిట్ ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. నకిలీ మద్యం వెనుక ఎవరున్నారు? దీనివెనుక నడిపిస్తున్నదెవరు? అసలు కుట్రదారులెవరు? అనేది తేలుతున్నారు. ఇకపై ఆ తరహా వ్యవహారాలు చేయాలంటే భయం పుట్టడం ఖాయమని మీడియాకు వివరించారు. అంతేగానీ ఇప్పటివరకు లభించిన సమాచారం బయటకు చెప్పలేదు.
ALSO READ: బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలంటూ అభిమానుల హంగామా
ఆఫ్రికాలో నేర్చుకుని ఏపీలో అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆ నేతలెవరో త్వరలో తెలుస్తుందని, ఇకపై వారిని సెట్ చేస్తామని చెప్పుకొచ్చారు. నకిలీ మద్యం కేసులో 23 నిందితులకు గాను 16 మందిని అరెస్టు చేసినట్టు వివరించారు. ఉన్నట్లుండి సీఎం చంద్రబాబు స్వయంగా నకిలీ మద్యం వ్యవహారంపై రియాక్ట్ కావడంతో వైసీపీలో చిన్నపాటి వణుకు మొదలైంది.
సిట్ పూర్తిస్థాయిలో రంగంలోకి దిగితే చాలామంది నేతలు అరెస్టు కావడం ఖాయమని వైసీపీ నేతల మాట. ఇప్పటికే మద్యం కుంభకోణంలో చాలామంది నేతలు ఇరుక్కున్నారు. మరి నకిలీ మద్యం కేసులో ఇంకెంత మంది బుక్కవుతారోనని చర్చించుకుంటున్నారు. ఏ ఇద్దరు వైసీపీ ఎదురెదురు పడినా ఈ అంశంపై మాట్లాడుకుంటున్నారు.
నకిలీ మద్యం వ్యవహారం గురించి పలుమార్లు మీడియా ముందుకొచ్చిన తిరుపతి మాజీ ఎమ్మెల్యే చాలా విషయాలు బయటపెట్టారు. ఈ లెక్కన ప్రతీ నియోజకవర్గంలో వైసీపీ నేతల గురించి ఆరా తీస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి నకిలీ, మద్యం కుంభకోణంతో వైసీపీ దుకాణం బంద్ కావచ్చని టీడీపీ నేతలు అంటున్నారు. రానున్న రోజుల్లో ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.