Cold Wave: తెలుగు రాష్ట్రాలను చలి గజగజ వణికిస్తుంది. పొగ మంచు అయితే ఇంకా వెంటాడుతూనే ఉంది. ఉదయం ఏడు గంటలు దాటినా మంచు పొరలు దట్టంగా ఉంటున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ములుగు, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాలైన షాద్నగర్, చేవెళ్ల వంటి ప్రాంతాల్లో తెల్లవారుజామున శీతల గాలులు ప్రజలను వణికిస్తున్నాయి. జనవరి 7వ తేదీ తర్వాత రాష్ట్రంలో కోల్డ్ వేవ్ (Cold Wave) ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది.
దట్టమైన పొగమంచు
రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాలు, రహదారులపై ఉదయం 9 గంటల వరకు దట్టమైన పొగమంచు కమ్మేస్తోంది. దృశ్యమాన్యత (Visibility) భారీగా తగ్గడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల హెడ్ లైట్లు ఆన్ చేసినప్పటికీ ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా పాఠశాల బస్సుల రాకపోకల సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున, అధికారులు ప్రయాణికులను అప్రమత్తం చేస్తున్నారు. కూడళ్ల వద్ద వాహనదారులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో మంచు దుప్పటి..
అలాగే ఏపీలో కూడా చలి తీవ్రత తక్కువగా ఏమీ లేదు. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పొగమంచు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాలోని కనిగిరి వంటి ప్రాంతాలు మంచు గుప్పిట్లో చిక్కుకున్నాయి. పొలాలు, చెట్లు, ఇళ్లపై మంచు తుంపర్లు పేరుకుపోతుండటంతో జనజీవనం స్తంభించిపోతోంది. డిసెంబర్ చివరి నాటికి పరిస్థితులు మారుతాయని భావించినప్పటికీ, జనవరిలో కూడా మంచు పొరలు దట్టంగా కమ్ముకోవడం ఆందోళన కలిగిస్తోంది.
జనజీవనంపై ప్రభావం
తీవ్రమైన చలి కారణంగా సామాన్య ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోవడంతో ప్రజలు చలి మంటలను కాచుకుంటున్నారు. పొగమంచు ధాటికి రవాణా వ్యవస్థపై కూడా ప్రభావం పడుతోంది. రైళ్లు, విమానాల రాకపోకల్లో జాప్యం జరుగుతోంది. పొలాల్లో మంచు ఎక్కువగా కురుస్తుండటంతో వ్యవసాయ పనులకు వెళ్లే కూలీలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Also Read: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాలేజీ బస్సు బోల్తా.. స్పాట్లో 60 మంది విద్యార్థులు
అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తెల్లవారుజామున ప్రయాణాలను వీలైనంత వరకు వాయిదా వేసుకోవడం మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వస్తే, వాహనాలకు ఫాగ్ లైట్లు (Fog Lights) అమర్చుకోవాలని, అతివేగాన్ని నియంత్రించాలని రవాణా శాఖ హెచ్చరిస్తోంది. చలి నుంచి రక్షణ పొందేందుకు ఉన్ని వస్త్రాలను ధరించాలని, ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ సూచిస్తోంది.
తెలంగాణలోని పలు జిల్లాల్లో చలి పంజా
పొంగమంచు కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
తెల్లవారుజాము నుంచి ఉదయం 9 గంటల వరకు పొగమంచు ప్రభావం
ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ములుగు ఏజెన్సీ ప్రాంతాలను కప్పేసిన పొగమంచు pic.twitter.com/NutJeghhyy
— BIG TV Breaking News (@bigtvtelugu) January 2, 2026