AP BJP: ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ సీటు నోటిఫికేషన్ మంగళవారం జారీ అయ్యింది. దీంతో పెద్దల సభకు ఎవరు వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ రేసులో టీడీపీ నుంచి చాలా మంది నేతలు ఉన్నారు. కాకపోతే ఈ సీటుపై బీజేపీ కన్నేసినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం విదేశీ పర్యటన ముగించుకున్న సీఎం చంద్రబాబు, గతరాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఈ విషయమై బీజేపీ పెద్దలతో మాట్లాడనున్నారు. ఆ తర్వాత ఎవరు పెద్దల సభకు వెళ్తారనేది తేలనుంది.
టీడీపీ నుంచి రేసులో..
వైసీపీ ఓడిపోయిన తర్వాత మారిన రాజకీయాల నేపథ్యంలో ఎంపీ పదవికి, ఆ పార్టీకి రాజీనామా చేశారు విజయసాయిరెడ్డి. ఆయన తర్వాత అడుగులు ఏంటి అనేది కాసేపు పక్కనబెడదాం. ఆయన రాజీనామా చేయడంతో ఎంపీ సీటు ఖాళీ అయ్యింది. ఈ సీటుకు పెద్దల సభకు ఎవరు వెళ్లబోతున్నారనే ఆసక్తికర చర్చ ఏపీలో జరుగుతోంది. ఈ సీటు కోసం టీడీపీ నుంచి ఐదారుగురు నేతలు రేసులో ఉన్నారు. వారిలో మాజీ మంత్రి యనమల పేరు బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే పార్టీ అవకాశం ఇచ్చే పెద్దల సభకు వెళ్లాలని ఉందని పలుమార్లు ఆయన బయటపెట్టారు.
ఏపీలో బీజేపీ నేతల మాటేంటి?
వీఎస్ఆర్ బీజేపీ పెద్దలతో టచ్లో ఉంటారని, అలాంటప్పుడు ఆ సీటు గురించి బీజేపీ పెద్దలను అడిగితే సరిపోతుందని టీడీపీ నేతల మాట. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎం చంద్రబాబు దీనిపై బీజేపీ నేతలతో మాట్లాడే అవకాశం ఉంది. ఈ సీటు కోసం ఏపీ బీజేపీ నుంచి చాలామంది నేతలు పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో మాజీ సీఎం కిరణ్కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు, పార్టీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డితోపాటు పలువురు ఉన్నారు. కేడర్ ఉన్నా ఎంపీ స్థాయి పదవులను చేపట్టే అనుభవం ఉన్న నేతలు కనిపించలేదన్న వార్తలూ లేకపోలేదు.
అన్నామలైకి ఛాన్స్?
పరిస్థితి గమనించిన బీజేపీ పెద్దలు ఏపీ నుంచి తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు అన్నామలైని రాజ్యసభకు పంపిస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తోంది. ఈ సీటుకు కాల పరిమితి మరో మూడేళ్లు ఉంది. మరో ఏడాదిలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న అన్నామలైకి అన్నాడీఎంకె మధ్య విభేదాల నేపథ్యంలో ఆ పదవి నుంచి ఆయన్ని తొలగించారు. కొత్త వ్యక్తికి ఆ పదవి అప్పగించారు. దీనిపై అన్నామలై సైలెంట్ అయిపోయారు. మాజీ ఐపీఎస్ అధికారి కావడంతో ఆయన్ని ఇలా అర్థాంతరంగా తప్పించడం కంటే రాజ్యసభకు పంపాలని డిసైడ్ అయ్యారట బీజేపీ పెద్దలు. అన్నామలైకి కేంద్రమంత్రి పదవి ఇస్తే తమిళనాడులో తమకు లైఫ్ ఉంటుందని ఆలోచన చేస్తున్నారట.
ALSO READ: ఏపీ ప్రభుత్వం తీపి కబురు, కోటి 20 లక్షల మందికి బెనిఫిట్
బీజేపీ పెద్దలతో బాబు మంతనాలు
2014-19 మధ్యకాలం ఏపీలో టీడీపీ-బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర మంత్రి సురేశ్ ప్రభుకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత నిర్మలా సీతారామన్ ఏపీ నుంచి పెద్దల సభలో అడుగుపెట్టారు. ఇప్పుడు అన్నామలై వంతు కానున్నట్లు ఢిల్లీలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు సీఎం చంద్రబాబు. ఆయనతో మాట్లాడిన తర్వాత బీజేపీ పెద్దలు ఈ సీటును ఫైనల్ చేయవచ్చని అంటున్నారు. దీనిపై సీఎం చంద్రబాబు ఏమంటారో చూడాలి. రాజ్యసభ సీటుకు మంగళవారం(ఏప్రిల్ 22 నుంచి 29 వరకు నామినేషన్ స్వీకరణ మొదలుకానుంది. ఈ లోపు ఈ సీటుపై క్లారిటీ రావచ్చని అంటున్నారు.