AP Govt Whatsapp Governance Service: మీరు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించేందుకు వెళుతున్నారా.. ముందుగా టికెట్స్ అందుకోలేదా.. అయితే ఇక నుండి డోంట్ వర్రీ.. మీకోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జస్ట్ ఒక్క మెసేజ్ చేస్తే చాలు.. మీ దర్శన టికెట్లు మీ చేతిలో ఉంటాయి. ఔను మీరు విన్నది నిజమే. ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ (WhatsApp Governance) విధానం తీసుకువచ్చిన ప్రభుత్వం.. ఎన్నో పౌర సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. ఆ సేవలలో భాగంగా మరో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఏపీలోని విజయవాడ (Vijayawada) కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనార్థం నిరంతరం భక్తులు వస్తుంటారు. ఈ అమ్మవారిని దర్శిస్తే చాలు.. సకల కోరికలు సిద్దిస్తాయని భక్తుల విశ్వాసం. రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా, దేశ విదేశాల నుండి కూడ భక్తులు అమ్మవారి దర్శనార్థం వస్తుంటారు. అయితే దర్శనం టికెట్లు పొందేందుకు భక్తులు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. పలుమార్లు టికెట్స్ పంపిణీ కేంద్రం వద్ద గందరగోళ పరిస్థితి ఏర్పడ్డ ఘటనలు కూడ జరిగాయి. ఇటువంటి పరిస్థితులను అర్థం చేసుకున్న ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది.
ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలపై సీఎం చంద్రబాబు రివ్యూ నిర్వహించారు. ఈ సంధర్భంగా ఇప్పటి వరకు ఎటువంటి సేవలు, ప్రజలకు అందుబాటులో ఉన్నాయో వాటి గురించి సీఎం సమీక్షించారు. యూజర్ ఫ్రెండ్లీగా వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. త్వరలో వాట్సాప్ గవర్నెన్స్లోకి టీటీడీ, రైల్వే సేవలు కూడ తీసుకువచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా రూ. 2.64 లక్షల లావాదేవీలు జరిగాయని కూడ సీఎం దృష్టికి అధికారులు తీసుకువచ్చారు. వాట్సాప్లో 35 శాతం సర్వర్ సమస్యలు వస్తున్నాయని, అన్ని శాఖలు సర్వర్ స్పీడ్ పెంచుకోవాలని సీఎం సూచించారు.
Also Read: Mahabubabad News: ఆ ఊర్లో చీకటి పడితే భయం.. ఒకటే రాళ్ల వర్షం.. పరుగులు పెడుతున్న ప్రజలు
ఈ సంధర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం టికెట్లపై కూడ చర్చ సాగింది. ఇప్పటికే 160కి పైగా సేవలను అందిస్తున్న తరుణంలో, అమ్మవారి దర్శనం టికెట్లను కూడ వాట్సాప్ గవర్నెన్స్ ద్వార అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కనకదుర్గమ్మ దర్శనం టికెట్లు కావాల్సిన వారు.. 95523 00009 నెంబర్ కు మెసేజ్ చేస్తే చాలు.. టికెట్ మీ అరచేతిలో ఉంటాయి. అమ్మవారి దర్శనం, ఆర్జిత సేవల టికెట్లు ఇకపై వాట్సాప్లోనే అందుబాటులో ఉండనున్నాయి. దళారీ వ్యవస్థకు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని భావించవచ్చు. ఈ సేవలపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా సుదూరంగా ఉన్న భక్తులకు ఈ సేవలు అందుబాటులోకి రావడం హర్షించదగ్గ విషయమని భక్తులు తెలుపుతున్నారు.