Stock Market Crash: దలాల్ స్ట్రీట్ ఢమాల్ అయ్యింది. దేశీయ మార్కెట్లకు ట్రంప్ భయం పట్టుకుంది. ముందు నుంచీ హెచ్చరించినట్లుగానే.. ట్రంప్ టారిఫ్ వాతలు పెడుతున్నారు. తన మాట వినని దేశాలపై భారీ సుంకాల్ని విధించారు. అధికార పగ్గాలు అందుకున్న కొన్నిరోజుల్లోనే.. ప్రపంచ దేశాలు అదిరిపోయేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే.. కెనడా, మెక్సికో, చైనా దిగుమతులపై భారీగా సుంకాలు విధించి.. తన దండయాత్రని మొదలుపెట్టారు.
కెనడా, మెక్సికో దిగుమతులపై 25 శాతం, చైనాపై 10 శాతం సుంకాలు విధించారు. ట్రంప్ తీసుకున్న ఈ ఒక్క నిర్ణయంతో.. ప్రపంచ దేశాల మధ్య ట్రేడ్ వార్ మొదలైంది. అమెరికా టారిఫ్కు కౌంటర్గా.. కెనడా కూడా ప్రతీకార చర్యలకు దిగింది. అగ్రరాజ్యం నుంచి తమదేశానికి వచ్చే ఉత్పత్తులపైనా 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు చేసిన ప్రకటన. .. మార్కెట్లను కుదిపేసింది. ట్రంప్ నిర్ణయం ట్రేడ్వార్కు దారి తీసే అవకాశం ఉందన్న అంచనాలతో.. ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. దాంతో స్టాక్ మార్కెట్ ఒత్తిడికి లోనైంది. ఒకానొక దశలో సెన్సెక్స్ వెయ్యి పాయింట్లు, నిఫ్టీ 350 పాయింట్లకు పైగా కోల్పోయాయి.
మంగళవారం స్టాక్ మార్కట్లకు అమంగళంగా మారింది. ఈ ఒక్కరోజే 10 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. సూచీ ఏదైనా ప్రస్తుతం రెడ్ కలర్లోనే కనిపిస్తోంది. దీంతో ఇన్వెస్టర్లంతా బేర్ మంటున్నారు. సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, స్మాల్, డిక్ క్యాప్ స్టాక్స్లో సైతం అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి.
అసలు మార్కెట్లు ఎందకు పడుతున్నాయి? అమ్మకాలకే ఎందుకు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు? ఇలాంటి ప్రశ్నలకు ఆన్సర్ ఒక్కటే.. అది భయం. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే ఇందులో ప్రధాన కారణం మాత్రం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇప్పటికే అమెరికా దిగుమతి చేసుకునే ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై 25 శాతం టారీఫ్లు పెంచారు. మరోవైపు త్వరలోనే తమపై ఎక్కువ టారిఫ్లు విధిస్తున్న దేశాలపై ప్రతీకార టారీఫ్లు విధిస్తానంటున్నారు. దీంతో ట్రేడ్ వార్ భయాలు వెంటాడుతున్నాయి.
Also Read: సొంతింటి కల నిజం చేసుకోవాలంటే ఈ టిప్స్ పాటించండి..
మరోవైపు దేశీయ ఈక్విటీ మార్కెట్లో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతున్నాయి. నిన్న 2 వేల 463 వేల కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. దీంతో ఈ ఎఫెక్ట్ గట్టిగానే పడింది. రోజురోజుకు రూపాయి బలహీనపడుతుండం ఈ అమ్మకాలకు కారణంగా తెలుస్తోంది.
బ్యాంకింగ్, ఆటో స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ 30 సూచీలో అన్ని షేర్లూ రెడ్లో ఉన్నాయి. జొమాటో, పవర్గ్రిడ్ కార్పొరేషన్, టాటా మోటార్స్, ఎల్అండ్టీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి.
అయితే.. ప్రపంచంలో పెద్ద పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ఏర్పడిన ఈ ట్రేడ్ టెన్షన్ ప్రభావం.. మిగతా దేశాలపైనా పడుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు.. అమెరికా చర్యపై చైనా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ని ఆశ్రయించింది. దాంతో పాటు ప్రతీకార చర్యలకు కూడా దిగితే.. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యపరంగా అంతరాయాలు ఏర్పడతాయనే ఆందోళనలు నెలకొన్నాయి. పైగా.. భారీ సుంకాలు విధించడం వల్ల.. అమెరికా వృద్ధి తగ్గుతుందని, మిగిలిన దేశాల్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని కూడా హెచ్చరిస్తున్నారు.