Anantapur News: ఈ రోజుల్లో అమ్మాయిల కొరత వల్ల చాలా కమ్యూనిటీల్లో పెళ్లికాని ప్రసాదుల వయస్సు పెరుగుతోంది. ఒకప్పుడు 25 ఏళ్లకే పెళ్లి చేసుకునేవారు. ఇప్పుడు 35 ఏళ్లు వచ్చినా అమ్మాయిల కోసం వెతుకులాట కొనసాగిస్తున్నారు. అలాంటి ఓ యువకుడు అక్కాచెల్లెళ్లను మ్యారేజ్ చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. అందుకు ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. పెళ్లి కోసం ఏర్పాట్లు అంతా రెడీ చేశారు. కాకపోతే శుభలేఖ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అర్థాంతరం ఆ పెళ్లి ఆగిపోయింది. అసలేం జరిగింది?
స్టోరీలోకి వెళ్తే..
ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గంలోని గుమ్మయగారి పల్లి గ్రామం నారీ నారీ నడుమ మురారి పెళ్లికి వేదికైంది. ఈ ప్రాంతానికి చెందిన గంగరాజు.. ఇద్దరు అమ్మాయిలతో పెళ్లికి సిద్దమయాడు. అదీ అక్క చెల్లెలతో. నమ్మడానికి విచిత్రంగా ఉన్నా ముమ్మాటికీ నిజం. కర్ణాటకలోని చిక్బల్లూరు ప్రాంతానికి చెందిన యువతులతో గంగరాజుకు నిశ్చితార్థం జరిగింది.
ఇద్దరు అమ్మాయిలను మ్యారేజ్ చేసుకుందుకు గంగరాజు సైతం అంగీకరించాడు. దీంతో ఇరు కుటుంబాలు ముహూర్తాలు పెట్టేసుకున్నారు. ఆ తర్వాత పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. ఏప్రిల్ 10న రాత్రి ఎనిమిదిన్నరకు పెళ్లి ముహూర్తం పెట్టేశారు. ఈ క్రమంలో శుభలేఖలు సైతం అచ్చు వేశారు. ఇరుకుటుంబాలు శుభలేఖలు పంపిణీ చేయడంలో నిమగ్నమయ్యాయి.
శుభలేఖలు అందుకున్నవారు ఒకే ముహూర్తం, నిమిషాల వ్యవధిలో పెళ్లి. వధువు లిద్దరు అక్కచెల్లెళ్లు. కాకపోతే అబ్బాయి ఒక్కడే. అదెలా సాధ్యమని చర్చించుకోవడం మొదలైంది. ఇదేదో బాగుందని కొందరు వ్యక్తులు ఆ శుభలేఖను స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది కాస్త వైరల్ అయ్యింది.
ALSO READ: జగన్ హెలికాప్టర్పై రాళ్ల దాడి, ఎస్పీ ఏమన్నారంటే..
రంగంలోకి ఐసీడీఎస్ అధికారులు
విచిత్రం ఏంటంటే అమ్మాయిలిద్దరు మైనర్ బాలికలు. ఈ విషయం ఐసీడీఎస్ అధికారుల దృష్టికి వెళ్లింది. మ్యారేజ్కు రెండురోజుల ముందు అమ్మాయి ఇంటికి వచ్చారు పోలీసులతోపాటు అధికారులు. మైనర్లకు వివాహం చేయడం చట్ట విరుద్ధమని వారికి చెప్పారు. ఇరు కుటుంబాలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని లేకుంటే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.
అమ్మాయిల్లో ఒకరికి 16 ఏళ్ల కాగా, మరొకరికి 15 ఏళ్లు. ఇరువర్గాల వారు సమీప బంధువులని, ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకున్నామని అధికారులకు తెలిపారు. చివరి సమయంలో ఇలా చేయడం బాగా లేదని చెప్పే ప్రయత్నం చేశాయి ఆ కుటుంబాలు. కనీసం ఒక్క అమ్మాయితో వివాహం జరిపించాలని ప్రాధేయపడ్డారు.
అందుకు అధికారులు ససేమిరా అన్నారు. చట్టాన్ని అతిక్రమించడానికి వీల్లేదన్నారు. చిన్న వయస్సులో పెళ్లి చేస్తే ఎదురయ్యే సమస్యలను ఆయా కుటుంబాలకు వివరించారు. చేసేదేమీ లేక ఆ పెళ్లి కాస్త వాయిదా పడిపోయింది. అమ్మాయిల తరపు బంధువులు, అబ్బాయి తరపు బంధువులకు కౌన్సిలింగ్ ఇచ్చారు ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు. దీంతో నారీ నారీ నడుమ మురారి పెళ్లి కాస్త ఆగిపోయింది.
అక్కచెల్లెళ్లతో పెళ్లికి సిద్ధమైన వరుడు..
ఈ నెల 10వ తేదీ ఉ.8.30 గంటలకు ముహూర్తం
సోషల్ మీడియాలో వైరల్ అయిన శుభలేఖ
ఇద్దరమ్మాయిలు మైనర్లు కావడంతో అడ్డుకున్న ఐసీడీఎస్ అధికారులు
ఇరు కుటుంబాల పెద్దలకు కౌన్సిలింగ్ ఇస్తామని, వినకుంటే కేసు నమోదు చేస్తామని హెచ్చరించిన ఐసీడీఎస్… pic.twitter.com/zAfHK4skrO
— BIG TV Breaking News (@bigtvtelugu) April 8, 2025