Gudivada Amarnath: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలు ఎన్నుకున్న సీఎంలా కాకుండా, ప్రైవేటు వ్యక్తులు ఎన్నుకున్న ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలపై నిప్పులు చెరిగారు. విద్య, వైద్యం, వ్యవసాయం, రోడ్లు ఇలా అన్ని రంగాలను చంద్రబాబు ప్రైవేటుపరం చేస్తున్నారని ఆరోపించారు.
గతంలో ఏపీఐఐసీ (APIIC) ద్వారా ఎంఎస్ఎంఈలకు భూములు కేటాయించేవారని, కానీ ఇప్పుడు పీపీపీ (PPP) పద్ధతి పేరుతో ఆ భూములను ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెడుతున్నారని అమర్నాథ్ విమర్శించారు. పీపీపీ ముసుగులో సినిమా హాళ్లు, రెసిడెన్షియల్ ప్లాట్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవచ్చని చెప్పడం దారుణమన్నారు. కేవలం రియల్ ఎస్టేట్ కంపెనీలకు మేలు చేయడం కోసమే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని, రానున్న రోజుల్లో పరిపాలనను కూడా ప్రైవేట్ పరం చేస్తారేమోనని ఎద్దేవా చేశారు.
రుషికొండ భవనాలపై టీడీపీ తప్పుడు ప్రచారం చేసిందని, నేడు ఆ భవనాలు రాష్ట్రానికే ఐకానిక్గా నిలిచాయని అమర్నాథ్ గుర్తుచేశారు. రాష్ట్రంలో ఎవరూ కట్టని విధంగా భవనాలు నిర్మిస్తే వైఎస్ జగన్ను విధ్వంసకారుడు అంటారని, అదే అమరావతిలో నీరు తోడటానికి రూ. 450 కోట్లు ఖర్చు చేసే చంద్రబాబు మాత్రం విజనరీనా అని సూటిగా ప్రశ్నించారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. పోటీతత్వం పెరగాలంటే ఎక్కువ టెండర్లు రావాలి కానీ, సింగిల్ టెండర్ వచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం చంద్రబాబు నియంతృత్వానికి నిదర్శనమని విమర్శించారు. సచివాలయాలకు చంద్రబాబు ఏ పేరు పెట్టినా, ఆ వ్యవస్థ సృష్టికర్త వైఎస్ జగనే అని, పేర్లు మార్చినంత మాత్రాన జగన్ చేసిన మంచిని ప్రజలు మర్చిపోరని అమర్నాథ్ పేర్కొన్నారు.
Read Also: Madhavi Latha: సాయిబాబా పై దుష్ప్రచారం.. మాధవీ లత పై కేసు నమోదు!