Handloom Sector: చేనేత రంగానికి ఊతమిచ్చేలా చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. నేతన్నలపై వరాల జల్లు కురిపించింది. ప్రస్తుతం చేనేత వస్త్రాలపై జీఎస్టీని భరించడమే కాదు, రూ.5 కోట్లతో నేతన్నలకు త్రిఫ్ట్ ఫండ్ కేటాయిస్తామని వెల్లడించారు.
వ్యవసాయం తర్వాత చేనేత రంగం ఏపీకి అత్యంత కీలకమైంది. దీని మీద ఆధారపడి జీవిస్తున్నవారు చాలా మంది ఉన్నారు. కొన్ని కుటుంబాలైతే తరతరాలుగా ఆ వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నాయి కూడా. ఈ నేపథ్యంలో మంగళవారం చేనేత రంగంపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష చేపట్టారు. ఆ రంగానికి చెందిన కార్మికులను ఏలా ఆదుకోవాలని అనే అంశంపై లోతుగా చర్చించారు.
ఈ విషయంలో అధికారుల నుంచి సూచనలు-సలహాలు స్వీకరించారు. జమ్మలమడుగు టూర్లో ఓ చేనేత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆ సమయంలో తన దృష్టికి వచ్చిన అంశాలను ముఖ్యమంత్రి ప్రస్తావించారు. మగ్గాలకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్కు 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందివ్వాలని డిసైడ్ అయ్యారు.
ఈ మేరకు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. దీనికితోడు చేనేత వస్త్రాలపై జీఎస్టీ వ్యవహారం ఎన్నాళ్ల నుంచో నలుగుతోంది. ఈ విషయంలో పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు అధికారులు. అయితే అక్కడి నుంచి ఎలాంటి సంకేతాలు వచ్చాయో తెలీదు. కాకపోతే ఆయా వస్త్రాలపై జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్తం పూర్తిగా భరించనుంది.
ALSO READ: సూపర్ సిక్స్ కి వైసీపీ ప్రచారం.. సాక్ష్యం ఇదే
చేనేత వస్త్రాలపై విధిస్తున్న జీఎస్టీని రాష్ట్రం కేంద్రానికి చెల్లించనుంది. చంద్రబాబు సర్కార్ ఈ నిర్ణయం వెనుక కారణాలు చాలానే ఉన్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీల్లో ఇది కూడా ఒకటి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చేనేత విభాగం పుంజుకుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల తక్కువ ధరకు చేనేత వస్త్రాలు అందుబాటులోకి రానున్నాయి.
దీనివల్ల వస్త్రాలకు విక్రయాలు పెరుగుతాయి. నేతన్నలకు లబ్ది చేకూరుతుందని చెప్పుకొచ్చారు. ఇదిలావుండగా చేనేత కార్మికుల కోసం త్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. ఇందుకోసం రూ.5 కోట్లు కేటాయించనున్నారు. ఈ నిధి ద్వారా అందులో నిమగ్నమైన వారికి దీర్ఘకాలిక సామాజిక భద్రత, ఆర్థిక సహాయం అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఆగష్టు 7 అంటే గురువారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. ఏపీకి చెందిన చేనేత ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో 10 అవార్డులు వచ్చాయి. ఒక జిల్లా-ఒక ఉత్పత్తి విభాగంలో తొలిసారి అవార్డు దక్కించుకుంది.