Harshaveena Attack Railway Koduru: వైఎస్ఆర్ కడప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలిగా గత కొంతకాలంగా పోరాడుతున్న హర్షవీణపై జనసేన నాయకుడు తాతంశెట్టి నాగేంద్ర, అతని అనుచరులు దారుణంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం స్థానిక టోల్ గేట్ సమీపంలో చోటుచేసుకుంది. తన బాబు కోసం పూలు, సామాన్లు కొనేందుకు టోల్ గేట్ వద్ద ఆగిన సమయంలో ఎటువంటి కారణం లేకుండానే తనపై, తనతో ఉన్న అబ్బాయిపై రాడ్లు, పైపులతో దాడి చేశారని బాధితురాలు కన్నీటి పర్యంతమైంది.
ఈ దాడిపై హర్షవీణ మాట్లాడుతూ.. “మేము పని ముగించుకుని వస్తుండగా టోల్ గేట్ వద్ద ఆగాము. అదే సమయంలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్, జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర కాన్వాయ్ అక్కడికి వచ్చింది. నేను కేవలం కారు వైపు తొంగి చూశాను అంతే. తాతంశెట్టి నాగేంద్ర ఆకస్మికంగా కారు దిగి తన అనుచరులతో కలిసి మాతో ఉన్న అబ్బాయిని తరిమి తరిమి కొట్టారు. చేతుల్లో రాడ్లు, పైపులు పట్టుకుని హోటల్ వరకు వెంటాడి 10 దెబ్బలకు పైగా వేశారు. ఎందుకు కొడుతున్నారని నేను అడ్డు వెళ్లగా, నా తల మీద కూడా బలంగా కొట్టి చంపేస్తానని బెదిరించారు” అని వాపోయారు.
ఈ దాడికి ముందు హర్షవీణ తెలుగుదేశం పార్టీ (TDP) కార్యాలయంలో జరిగిన ప్రజాదర్బార్ కు వెళ్లారు. అక్కడ పార్టీ నేత ముక్కా రూపానందరెడ్డిని కలిసి తనకు జరుగుతున్న అన్యాయంపై ఫిర్యాదు చేసి, న్యాయం చేయాలని కోరారు. ప్రజాదర్బార్ ముగిసి తిరిగి వెళ్తున్న సమయంలోనే ఈ దాడి జరగడం వెనుక రాజకీయ కుట్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. “పని అయిపోయింది. ఈరోజు నా చేతిలో చచ్చిపోతావు.” అంటూ తాతంశెట్టి నాగేంద్ర తనను వ్యక్తిగతంగా దూషించాడని ఆమె ఆరోపించారు. టోల్ గేట్ వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తే నిజానిజాలు బయటపడతాయని ఆమె స్పష్టం చేశారు.
తీవ్రంగా గాయపడిన హర్షవీణ రైల్వేకోడూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మద్యం మత్తులో ఉన్నారో లేదా పాత కక్షలతో చేశారో తెలియదు కానీ, నడిరోడ్డుపై ఒక మహిళ అని కూడా చూడకుండా దాడి చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలోని సీసీ ఫుటేజీని సేకరించే పనిలో ఉన్నారు. అధికార కూటమికి చెందిన నాయకుల మధ్యే ఇలాంటి వివాదాలు రావడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.
రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణ పై దాడి
హర్షవీణ పై దాడి చేసిన జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర అనుచరులు
ఈ రోజు టీడీపీ ప్రజదర్బార్ లో ముక్కా రూపానందరెడ్డిని కలిసి..
న్యాయం చేయాలని కోరిన హర్షవీణఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు
Railway Koduru MLA Arava… pic.twitter.com/WeNxGSBOZK
— BIG TV Breaking News (@bigtvtelugu) April 2, 2026
Read Also: జన నాయగన్ వాయిదా వెనుక రాజకీయ కుట్ర… విజయ్ ఎమోషనల్ కామెంట్స్!