Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా అకాల వర్షాలు, వడగండ్ల వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో మంగళవారం అర్ధరాత్రి నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయి భారీ వర్షాలు కురిశాయి. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల ప్రాంతంతో పాటు నిజామాబాద్, కామారెడ్డి, వికారాబాద్ వంటి జిల్లాల్లో వడగండ్ల వాన కురవడంతో జనజీవనం స్తంభించిపోయింది. అటు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలో కూడా ఇదే తరహాలో వడగండ్లు పడటంతో ఈ అకాల మార్పులు ప్రజలను విస్మయానికి గురిచేస్తున్నాయి.
నగరంలో దంచికొట్టిన వర్షం..
హైదరాబాద్లో నిన్న రాత్రి వాన బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా జూబ్లీహాల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్, పంజాగుట్ట, రహమత్నగర్, యూసఫ్గూడ్, బోరబండ, ఎర్రగడ్డ, సనత్నగర్, కూకట్పల్లి, KPHB, మూసాపేట్, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ ఏరియాల్లో భారీ వర్షం కురిసింది.
రైతుల్ని నిండా ముంచిన వర్షాలు..
అయితే ఈ అకాల వర్షాల ప్రభావం వ్యవసాయ రంగంపై తీవ్రంగా పడింది. ప్రస్తుతం కోత దశలో ఉన్న వరి, ఇతర పంటలు వడగండ్ల ధాటికి నేలవాలాయి. ముఖ్యంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వడగండ్ల వాన కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆకాశం నుంచి పడిన మంచు ముక్కలు మొక్కలను తుత్తునియలు చేయడంతో చేతికి అందాల్సిన పంట కళ్లముందే నాశనమవ్వడం అన్నదాతలను కోలుకోలేని దెబ్బ తీసింది.
తడిచిన ధాన్యం.. ఆందోళనలో రైతులు
మరోవైపు, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం పరిస్థితి కూడా దయనీయంగా మారింది. ప్రభుత్వ ఐకేపీ (IKP) కేంద్రాలకు తెచ్చిన ధాన్యం కుండపోత వర్షానికి తడిసి ముద్దయింది. తగినన్ని టార్పాలిన్ కవర్లు అందుబాటులో లేకపోవడం, ధాన్యం నిల్వలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో ఆలస్యం కావడం వల్ల ధాన్యం కొట్టుకుపోవడం లేదా మొలకెత్తే ప్రమాదం ఏర్పడింది. దీనివల్ల రైతులకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం కనిపిస్తోంది.
మరో మూడు రోజులు భారీ వర్షాలు..
హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని కరీంనగర్, పెద్దపల్లి, నాగర్కర్నూల్, గద్వాల, ఆదిలాబాద్ వంటి మరికొన్ని జిల్లాల్లో మరో మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాలో ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని, ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Also Read: ఢిల్లీలో బిజీగా సీఎం రేవంత్.. పార్టీ ముఖ్యనేతలతో భేటీ, ఆపై సూచనలు కూడా
వాతావరణ హెచ్చరిక..
అకాల వర్షాల నేపథ్యంలో రైతులు తమ ధాన్యం రాశులను కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు వెలువడుతున్నాయి. పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల దగ్గర ఉండవద్దని ప్రభుత్వం హెచ్చరించింది. నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని, పంట నష్టం అంచనా వేసి పరిహారం అందించాలని బాధితులు కోరుతున్నారు.