Indigo flight: రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. హైదరాబాద్ నుంచి రేణిగుంట చేరుకున్న ఈ విమానం, తిరిగి హైదరాబాద్ బయలుదేరేందుకు రన్వేపై సిద్ధమవుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. విమానం టేకాఫ్ తీసుకోడానికి ముందు రన్వేపై పయనిస్తుండగా.. పైలట్లు సాంకేతిక సమస్యను వెంటనే గుర్తించారు. ఎటువంటి రిస్క్ తీసుకోకుండా, అప్రమత్తత ప్రదర్శిస్తూ పైలట్లు విమానాన్ని రన్వేపైనే నిలిపివేశారు.
సమస్య తీవ్రత ఏంటో తెలియకపోవడం, విమానం రన్వే మధ్యలో ఆగిపోవడం చూసి ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు లోనయ్యారు. విమానం లోపల కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సుమారు 100 మందికి పైగా ప్రయాణికులు క్షేమంగా ఉన్నారు. అయితే, తమ గమ్యస్థానానికి ప్రయాణం ఆగిపోవడంతో వారు అసౌకర్యానికి గురయ్యారు. సమాచారం అందిన వెంటనే విమానాశ్రయ అధికారులు, సాంకేతిక బృందం వేగంగా స్పందించారు. ఇంజనీర్ల బృందం వెంటనే రన్వే వద్దకు చేరుకుంది. విమానాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. తలెత్తిన సాంకేతిక లోపాన్ని సరిదిద్దేందుకు చర్యలు ప్రారంభించారు. లోపం స్వభావం, దాన్ని పరిష్కరించడానికి పట్టే సమయంపై అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయాణికులతో పరిస్థితిని వివరిస్తున్నారు. ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్ల గురించి చర్చలు జరుపుతున్నారు. ప్రయాణికులను రన్వే నుంచి విమానాశ్రయం టెర్మినల్కు తరలించేందుకు చర్యలు చేపడుతున్నారు. వారికోసం భోజనం, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటన కారణంగా రేణిగుంట విమానాశ్రయంలో విమానాల రాకపోకలపై ఎలాంటి ప్రభావం పడుతుందనేది అధికారులు సమీక్షిస్తున్నారు. రన్వే త్వరగా అందుబాటులోకి తీసుకురావడానికి, ఇండిగో విమానాన్ని రన్వే నుంచి తరలించడానికి అత్యవసర చర్యలు కొనసాగుతున్నాయి.
ALSO READ: Top 20 News: క్షుద్రపూజ పేరుతో మోసపోయిన దంపతులు…యాదాద్రిలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం