మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పుణ్యమా అని రాష్ట్రంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం వైట్ ఎలిఫెంట్లా మారిందని కూటమి నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.ఆయన ముందుచూపు లేమితో కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ చేపట్టారని ఆరోపించారు. అందుకే ప్రస్తుతం ఆ ప్రాజెక్టు నిరూపయోగంగా మారిందని పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. అయితే, జగన్కు పేరు రాకుండా ఉండేందుకు కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ నడుమ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా జలవివాదం నెలకొన్నది.
తెలంగాణలో పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం విషయమై ప్రతిపక్ష బీఆర్ఎస్ అధికార కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్నది. పవర్లోకి వచ్చి రెండేండ్లు అయినా సీఎం సొంత జిల్లాలోని పాలమూరును పట్టించుకోకుండా పడావు పెట్టారని కేటీఆర్, హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేస్తు్న్నారు.ఇటీవల కేసీఆర్ సైతం పాలమూరు రంగారెడ్డిపై ఎత్తిపోతలపై స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వంపై పెద్దఎత్తున విమర్శలు చేశారు. ఓ వైపు ఏపీ సర్కార్ కృష్ణా జలాల దోపిడీకి పాల్పడుతున్న సీఎం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. దీనిపై పెద్దఎత్తున ఉద్యమిస్తామని, జిల్లాలో సభలు ఏర్పాటు చేసి మరీ కాంగ్రెస్ తెలంగాణ రైతాంగానికి చేస్తున్న ద్రోహాన్ని వివరిస్తామన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర సర్కార్ నల్లమల సాగర్ లింకు ప్రాజెక్టుపై అటు కేంద్రానికి, సుప్రీంకోర్టులో కేసు వేసింది.దీంతో ప్రాజెక్టు లింకు పనులు ఆగిపోయినట్టు తెలుస్తున్నది.
సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో లోపాయికారీ ఒప్పందం చేసుకుని రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని వైసీపీ ప్రధానంగా ఆరోపిస్తున్నది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంపై టీడీపీ వివక్ష చూపిస్తున్నదని ఆరోపిస్తున్నది. చంద్రబాబు చేపట్టిన బనకచర్ల, నల్లమల లింక్ సాగర్ పనులను తెలంగాణ అడ్డుకున్నదని.. ఆ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు చంద్రబాబే వారితో లాలుచీ పడ్డారని వైసీపీ విమర్శలు చేస్తున్నది. దీనికి తోడు మాజీ సీఎం జగన్ కు పేరు రాకూడదని 85 శాతం పనులు పూర్తయిన రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నది.
ఈ ప్రాజెక్టు పూర్తయితే శ్రీశైలం నుంచి 3 టీఎంసీల నీటిని తరలించి సీమ ప్రజల దాహార్తిని తీర్చవచ్చని వైసీపీ చెబుతున్నది. కాగా, ఆ ప్రాజెక్టుకు ఇప్పటికే రూ.900 కోట్లకు పైగా గత వైసీపీ సర్కార్ ఖర్చుచేసింది. కాగా, ఈ ప్రాజెక్టు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులు లేవు. దీంతో పనులు నిలిపివేయాలని కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాలిచ్చింది. దీనికి తోడు కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. ఇదే విషయాన్ని కూటమి నేతలు గుర్తుచేస్తున్నారు. కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు లేకుండా ప్రభుత్వం దీనిపై ముందుకు వెళ్లలేదని ఇటీవల రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. జగన్ అనాలోచిత నిర్ణయం వల్లే రూ.900 కోట్లు వృథా అయ్యాయని.. పనులు కూడా పూర్తికాలేదని ఆయన విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన తప్పుకు కూటమి సర్కారును విమర్శించడం తగదని ఆయన అన్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా సీమ ప్రజలను రెచ్చగొట్టేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని.. ఇది ఎంతవరకు సమంజసం కాదని కూటమి నేతలు మండిపడుతున్నారు.