ట్రంప్ దెబ్బకు అమెరికా సహా ప్రపంచమంతా విలవిల్లాడిపోతోంది. సుంకాలు పెంచడంతో భారత్ నుంచి ఎగుమతులకు కష్టకాలం మొదలైంది. ముఖ్యంగా ఏపీ నుంచి ఆక్వారంగం తీవ్ర సంక్షోభంలో మునిగిపోయే ప్రమాదం కనపడుతోంది. ఈ దశలో కేంద్రం సాయం చేయాలంటూ సీఎం చంద్రబాబు మంత్రి పీయూష్ గోయల్ కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఆ లేఖ కూడా తమ పుణ్యమేనంటున్నారు మాజీ సీఎం జగన్. తమ ఒత్తిడి వల్లే చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారని, అయితే రాష్ట్రం చేయాల్సింది ఇంకా చాలా ఉందని, అది మాత్రం చేయకపోవడం దారుణం అని అన్నారు. ఈమేరకు ఆయన ఒక సుదీర్ఘ ట్వీట్ వేశారు.
నిద్రపోతున్నారా..?
ఏపీలో ఆక్వారంగం తీవ్ర సంక్షోభంలో ఉంటే నిద్రపోతున్నారా..? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు జగన్. అమెరికా టారిఫ్ల దెబ్బతోపాటు.. ఆపేరు చెప్పి టీడీపీకి చెందిన వ్యాపారులంతా సిండికేట్ అయి ఆక్వా రైతులను దోచుకుతింటున్నారని మండిపడ్డారు. రోజు రోజుకీ ధరలు పతనం అవుతుంటే ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని నిలదీశారు. ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు సమీక్షలు పెట్టలేదని, గట్టి చర్యలు ఎందుకు తీసుకోలేదన్నారు. లేఖలు రాసి సరిపెట్టడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. 100 కౌంట్ ఉండే రొయ్యల ధర అకస్మాత్తుగా రూ.280 నుంచి దాదాపు రూ.200- రూ.210కి పడిపోయిందని గుర్తు చేశారు. ధరలు తగ్గుతుంటే, క్రాప్ హాలిడే తప్ప వేరే మార్గం లేదని రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని చెప్పారు జగన్.
రైతుల కష్టాలు..
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులు కష్టాలపాలయ్యారని అన్నారు జగన్. వరి ధాన్యం, పత్తి, పొగాకు, మిర్చి, కంది, పెసలు, మినుము, అరటి, టమోటా.. ఏ పంటకు కూడా గిట్టూబాటు ధర లేకుండా పోయిందన్నారు. దళారులు రైతుల కష్టాన్ని దోచుకుతింటున్నారని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కనీస బాధ్యత కూడా తీసుకోవడం లేదని విమర్శించారు. ఇప్పుడు ఆక్వా రైతాంగం విషయంలో కూడా ప్రభుత్వం అదే నిర్లక్ష్యం చూపిస్తోందని మండిపడ్డారు జగన్.
మేమేం చేశామంటే..?
వైసీపీ హయాంలో ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశామని, ధరల నియంత్రణతోపాటు, సీడ్, ఫీడ్ విషయంలో నాణ్యత పాటించేలా ప్రత్యేక చట్టాలు తీసుకువచ్చామన్నారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా రొయ్యల ధరలు నిర్ణయించామన్నారు. ఐదేళ్ల క్రితమే కనీస ధరగా రూ.210 నిర్ణయించి రైతులకు బాసటగా నిలిచామన్నారు. తమ హయాంలో మూడుసార్లు ఫీడ్ ధరలు కూడా తగ్గించామన్నారు జగన్. కూటమి ప్రభుత్వం వచ్చాక ముడిసరకుల దిగుమతులపై సుంకం తగ్గినా, ఆ మేర ఫీడ్ ధరలు తగ్గించలేకపోయారని విమర్శించారు.
2014 నుంచి 2019 మధ్య కాలంలో టీడీపీ హయాంలో ఆక్వాజోన్ పరిధి కేవలం 80-90వేల ఎకరాలు మాత్రమే ఉండేదని, వైసీపీ హయాంలో 4.22 లక్షల ఎకరాలను ఈ జోన్ పరిధిలోకి తీసుకొచ్చామన్నారు జగన్. కరెంటు సబ్సిడీకోసం రూ.3,640 కోట్లు ఖర్చుచేశామని చెప్పారు. ఆక్వాజోన్స్లో ఉన్న రైతు భరోసా కేంద్రాల్లో ఆక్వా అసిస్టెంట్లను నియమించామని, ఇప్పుడు ఆర్బీకే వ్యవస్థను కూడా కూటమి ప్రభుత్వం నాశనం చేసిందని మండిపడ్డారు. టారిఫ్ లు కేవలం ఇండియాకి మాత్రమే పరిమితం కావని, ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ధరల పతనాన్ని అడ్డుకోవాలని సూచించారు జగన్.
జగన్ సూచనలకు టీడీపీ నేతలు కూడా అదే స్థాయిలో బదులిస్తున్నారు. అమెరికా టారిఫ్ లు పెరిగితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని లాజిక్ తీస్తున్నారు. కాస్తో కూస్తో కేంద్రం ఆదుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. అందుకే సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారని చెబుతున్నారు.