![](https://www.bigtvlive.com/wp-content/uploads/2024/02/pawan-kalyan-2-1024x576.jpg)
Pawan Kalyan Drives Own Car: జనసేన పార్టీ స్థాపించి, కొత్త రాజకీయాన్ని పరిచయం చేస్తానంటూ జనంలోకి వెళుతున్న పవన్ కల్యాణ్.. ఇప్పుడు పూర్తిగా మారిపోయారా? నిన్నటి వరకు పార్టీ కార్యక్రమాల విషయంలో ప్రతిదానికీ నాదెండ్ల మనోహర్ మీద ఆధారపడిన జనసేనాని ఇప్పుడు తానే స్వయంగా రంగంలోకి దిగారా? అంటే.. అవునంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
జనసేన పార్టీ పెట్టినప్పటికీ.. పవన్ కల్యాణ్ గతంలో పార్టీ కార్యకర్తలకు పెద్దగా అందుబాటులో ఉండేవారు కాదు. పార్టీ కార్యాలయానికీ అడపాదడపా మాత్రమే వచ్చిపోయేవారు. ఆ సందర్భంగా ఏదైనా అంశం మీద విధాన పరమైన నిర్ణయం తీసుకునే సందర్భంలోనూ ఆయన మాటల్లో స్పష్టత ఉండేది కాదు.
అటు పార్టీ నిర్మాణం మీద కూడా ఆయన పెద్దగా దృష్టి పెట్టింది లేదు. గతంలో ఎవరైనా నాయకుడిని పార్టీలోకి తీసుకోవాలంటే పవన్ తన పార్టీ సీనియర్ నేతలతో చర్చలు జరిపేవారు గానీ నేరుగా మీడియాతో మాట్లాడిన దాఖలాలు లేవు. కానీ.. గత కొన్నాళ్లుగా జనసేనాని వైఖరిని పరిశీలిస్తే.. ఆయనలో కొత్త పవన్ కల్యాణ్ కనిపిస్తున్నాడు.
ముఖ్యంగా నిన్న మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి ఆయన కొత్త రేంజ్ రోవర్ కారును స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. ఇది జనసైనికుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అంతేకాదు.. మచిలీ పట్నం సీటు ఆశిస్తున్న వల్లభనేని బాలశౌరి నిన్న జనసేనలో చేరిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలోనూ పవన్ అన్నీ తానై వ్యవహరించారు.
రాబోయే రోజుల్లో జనసేన కార్యాచరణను ఆయన కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. ‘పొత్తుల్లో కొన్ని ఇబ్బందులు తప్పవు. కానీ… రాష్ట్ర భవిష్యత్ కోసం అడ్జెస్ట్ కావాల్సిందే. రానున్న ఎన్నికల్లో మనం కీలక పాత్ర పోషించబోతున్నాం. జనసేన- టీడీపీ ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాం. జగన్ దుర్మార్గపు పాలన నుంచి మన రాష్ట్రాన్ని రక్షించుకోవాలి. జగన్ వల్ల రాష్ట్రం ఐదేళ్లు వెనక్కుపోయింది. మరోసారి జగన్ వస్తే ఏం జరుగుతుందో ప్రజలంతా ఆలోచన చేయాలి. చావో రేవో తేల్చుకోవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను’ అంటూ విస్పష్టంగా మాట్లాడారు.
ఇది జనసేన కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ముఖ్యంగా ఎంతోకాలంగా పార్టీకోసం పనిచేసినా గుర్తింపు దక్కటం లేదని, నిరాశకు లోనైన వారికి నిన్నటి పవన్ సందేశం కొత్త జోష్ను తెచ్చింది. నేను అన్నింటికీ తెగించి పోరాడబోతున్నా.. నాతో వచ్చేవారంతా ఇక రోడ్డెక్కాల్సిందే. అనే పరోక్ష సందేశాన్ని పవన్ తన అభిమానులకు, కార్యకర్తలకు ఇచ్చినట్లయింది.
గతంలో ప్రతిదానికీ ‘అయితే..’, ‘కానీ..’, ‘వేచి చూద్దాం’, ‘తొందరపడొద్దు’ అంటూ మాట్లాడే పవన్.. నిన్న మాట్లాడిన దానిని బట్టి.. తమ నాయకుడు ఫుల్టైమ్ పాలిటీషియన్గా మారాడనీ, రేపటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన విశ్వరూపం చూపించబోతున్నారని జనసైనికులు భావిస్తున్నారు. దీంతో తాముసైతం ఆయన వెంటనడవాలనే నిర్ణయానికి వచ్చేసినట్టు రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
అంతేకాదు.. నిన్నటి ప్రసంగంతో ఇకపై పార్టీ కార్యక్రమాలు, కీలక నిర్ణయాల్లో అన్నీ తానై వ్యవహరిస్తానని, కష్టపడి పనిచేసే కార్యకర్తలెవరికీ అన్యాయం జరగదనే పరోక్ష సందేశాన్ని కూడా పవన్ అందించినట్లయిందని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా పవన్ ఇప్పుడు పెద్దమనిషి రాజకీయాలు నేర్చాడంటున్నారు మన రాజకీయ విశ్లేషకులు.