తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని జనసేన పార్టీ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి ఘనవిజయం సాధించిన ఉత్సాహంతో.. ఇప్పుడు తెలంగాణలోనూ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై అధినాయకత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల్లోనూ జనసేన అభ్యర్థులను నిలబెట్టాలని నిర్ణయించింది.
ఈ మేరకు జనసేన పార్టీ కీలక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణలో పార్టీ ఉనికిని చాటుకోవడమే కాకుండా.. నిర్ణయాత్మక శక్తిగా ఎదగడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కేవలం కొన్ని పట్టణాలకే పరిమితం కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పురపాలక సంఘాల్లో పోటీ చేస్తామని స్పష్టం చేసింది. ఇందుకోసం క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు కమిటీల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు తెలిపింది.
ఎన్నికలకు సమయం తక్కువగా ఉన్నందున, జనసైనికులుసమరోత్సాహంతో సిద్ధం కావాలని పిలుపునిచ్చింది. ప్రతి కార్యకర్త సోషల్ మీడియా వేదికగా మాత్రమే కాకుండా, ప్రజల మధ్యకు వెళ్లి పార్టీ సిద్ధాంతాలను వివరించాలని కోరింది. ముఖ్యంగా స్థానిక సమస్యల పరిష్కారంపై జనసేన పోరాడుతుందని.. ప్రజలకు జవాబుదారీగా ఉండే అభ్యర్థులను బరిలోకి దించుతామని వివరించింది.
త్వరలోనే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూచనల మేరకు పూర్తిస్థాయి ఎన్నికల కార్యాచరణను ప్రకటించనున్నట్లు జనసేన వర్గాలు వెల్లడించాయి. అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలు, ఇతర పొత్తుల అంశాలపై స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో బలమైన పునాది వేయడానికి ఈ మున్సిపల్ ఎన్నికలను ఒక వేదికగా మలుచుకోవాలని పార్టీ భావిస్తోంది. గతంలో కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే పోటీ చేసిన జనసేన, ఈసారి రాష్ట్రవ్యాప్త విస్తరణే ధ్యేయంగా ముందుకు వెళ్తోంది.
ALSO READ: CM Chandrababu: నదుల గురించి జగన్కు మినిమమ్ సబ్జెక్ట్ లేదు.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు