JC Prabhakar Reddy: తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరికీ భయపడను అని తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. ఎవరూ గెలవలేని చోట తాను ఒక్కడినే గెలిచానని.. ఎవరకీ భయపడను అని చెప్పడానికి ఇదొక్కటే నిదర్శనమని చెప్పారు. డబ్బుల కోసం పార్టీలలో చేరారంటూ కొందరు మాట్లాడుతున్నారని.. అసలు తమ గురించి ఏమనుకుంటున్నారని అంటూ ప్రభాకర్ రెడ్డి ధ్వజమెత్తారు.
ఈరోజు జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 1951లోనే మద్రాసులో మమ్మల్ని చదివించారని.. తాము డబ్బులు లేనోళ్లం.. ఇప్పుడిప్పుడే సంపాదిస్తున్నామని.. ఇది తమ బ్యాక్ గ్రౌండ్ అంటూ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. తమ గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన ఫైరయ్యారు.
ఖరీదైన కార్లలో తాము ఎప్పుడో తిరిగామని చెప్పారు. తమ ఇంట్లో లేని కారు లేదని.. తాము డ్రైవ్ చేయని కారు లేదని అన్నారు. తాము లేనివాళ్లం అంటూ కొందరు చౌకబారు విమర్శలు చేస్తున్నారని… తన పొగరు వల్ల గత ఐదు సంవత్సరాలు ఆర్థికంగా నష్టపోయామని అన్నారు. డబ్బుల కోసం ఫ్లై యాష్ అంటూ విమర్శిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లై యాష్ అనేది తన పుట్టగోస లాంటిదని చెప్పుకొచ్చారు. అది కేవలం తమ ప్రెస్టేజ్ మాత్రమేనని.. తమ గురించి మాట్లాడే వాళ్ళకే కాదు.. తమకు కూడా చీము నెత్తురు ఎక్కువగా ఉందని అన్నారు.
తమకు వైఎస్ కుటుంబానికి ఎప్పటి నుంచో సాన్నిహిత్యం ఉండేదని.. ఇప్పుడు మాత్రం అది కొనసాగడం లేదని అన్నారు. రాజారెడ్డి దగ్గర్నుంచి ఆ కుటుంబంతో సాన్నిహిత్యం కట్ అయిపోయిందని చెప్పుకొచ్చారు. ఆల్ ఇండియా బస్సులను నడిపిన తాము అన్నీ బస్సులను పోగుట్టుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అయిదేళ్ల కోసం అన్ని అమ్ముకున్నామని చెప్పారు. కానీ తాము ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు.
తాను కావాలంటే క్లీనర్గా అయినా.. వాచ్మెన్గా అయినా పని చేసుకుంటానని చెప్పారు. తన లారీలను పగలకొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మీద నమోదైన FIRలను మీడియా ముందు ప్రవేశపెట్టారు. భారీ స్థాయిలో FIR బుక్ లను మీడియా ముందు చూపెట్టారు. వీటి అన్నింటి కారణంగానే తమ అన్న జేసీ దివాకర్ రెడ్డికి ఆరోగ్యం బాగాలేదన్నారు. తాము కేవలం ప్రజల కోసమే రాజకీయాల్లో ఉన్నామని చెప్పారు.
తమ కుటుంబం మొదటి నుంచి రాజ వంశీకులమేనని చెప్పారు. 1952 నుంచి 2024 వరకు రాజకీయంగా అందరికీ సహాయం చేశామన్నారు. తమ సమస్యలపై అందరికీ మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. తాను ఎవరికి ఎక్కడ తలవంచాల్సిన అవసరం లేదని.. చేతకాకపోతే తన కుటుంబం కోసం ఎలాంటి పని చేసి అయినా బతుకుతామన్నారు. డీజీపీ నుంచి ఎస్పీ స్థాయి అధికారులకు న్యాయం చేయమని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని జేపీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.