KA Paul says please one chance: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విలక్షణమైన పొలిటీషియన్, ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్. ఈయన గురించి తెలుగు రాష్ట్రాల్లోని చాలామంది ప్రజలకు తెలుసు. సుత్తి లేకుండా చెప్పాల్సిన నాలుగు ముక్కల్ని సూటిగా వివరించడం ఆయనకు వెన్నతోపెట్టిన విద్య. ఏ పార్టీనైనా… ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ప్రెసిడెంట్ ఇలా ఎవరినైనా ఏకి పారేయడమే ఆయన నైజం. విశాఖ నుంచి బరిలోకి దిగుతున్న ఆయన.. ఈసారి విజయం సాధించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ క్రమంలో రకరకాల వ్యూహాలను అమలు చేస్తున్నారు.
ముఖ్యంగా విశాఖలోని మత్య్సకారుల ఓటు బ్యాంకుపై దృష్టి పెట్టారు కేఏ పాల్. ఇందులో భాగంగా ఆయన మత్య్సకారులతో కలిసిపోయి చేపలు పట్టేశారు. వాళ్ల సమస్యలు తనకు పూర్తిగా తెలుసన్న ఆయన.. మినీ హార్బర్ కట్టాలని ఎప్పటినుంచో వాళ్లు కోరుతున్నారని అన్నారు. ఈసారి ఎన్నికల్లో తాను గెలిస్తే కచ్చితంగా మినీ హార్బర్ కట్టిస్తానని హామీ ఇచ్చారు.
ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటానని చెప్పుకొచ్చారు. విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న కుండ గుర్తుపై ఓటేసి తనను గెలిపించాలని మత్య్సకారులను కోరారు. కేఏపాల్ ఎక్కడ ప్రచారం చేసినా తనతోపాటు పార్టీ గుర్తును తీసుకెళ్లి ఓటర్లకు పరిచయం చేస్తారు. అంతేకాదు ఈవీఎంల్లో తన నెంబర్ ఫలానా అని చెబుతారు. ఆటోడ్రైవర్ల వద్దకు వెళ్తే వాళ్లకు భరోసా ఇచ్చారు.
ALSO READ: ఏపీ కొత్త డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా..
వైసీపీ అధినేత జగన్ నవ రత్నాలతో మేనిఫెస్టోను విడుదల చేశారు. ఆయనకు ధీటుగా కేఏ పాల్ మాత్రం దశ రత్నాలతో మేనిఫెస్టోను రూపొందించారు. దాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. తనకు కవరేజ్ ఇచ్చిన ఛానెళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తానని మీడియాను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. ఒకవేళ హామీలకు నిధులు ఎక్కడ నుంచి వస్తాయని ఎవరైనా అడిగితే.. అమెరికా ప్రెసిడెంట్ మనోడే.. కోట్లలో నిధులు వస్తాయని సింపుల్గా ఒక్కముక్కలో చెబుతారు.
హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టించేందుకు నిధులు తానే ఇచ్చానని అంటారు కేఏ పాల్. గతరాత్రి విశాఖ బీచ్లో ప్రచారం చేసిన ఆయన, సైకిల్, ఫ్యాన్ను మరిచిపోయి కుండ గుర్తుకే ఓటేయాలని పర్యాటకులను తెలిపారు. చంద్రబాబుకు అమెరికా ఎక్కడ ఉందో తెలీదని, బిల్గ్రేట్స్ను ఆయనకు తానే పరిచయం చేశానన్నారు. పవన్ బీజేపీతో కలిశారని, ఆయన అన్న కాంగ్రెస్లో కలిశారని గుర్తు చేశారు.
జాలరి కేఏ పాల్..#AndhraPradesh #Elections2024 #KaPaul #Visakhapatnam #NewsUpdate #bigtv pic.twitter.com/yBplpaWdtb
— BIG TV Breaking News (@bigtvtelugu) May 6, 2024