Kadapa News: నేటి సమాజంలో అపార్థాలు, అనవసరపు అనుమానాలు పచ్చని సంసారంలో చిచ్చు పెడుతున్నాయి. కట్టుకున్న భార్యను కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడే.. లేనిపోని నిందలు వేస్తూ.. చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో విడాకులు తీసుకోవడం ఒక ఎత్తు అయితే కన్నబిడ్డను కూడా కాదనుకోవడం మరో ఎత్తు. అలాంటి ఘటనే ఇప్పుడు కడప జిల్లాలో చోటుచేసుకుంది. న్యాయం కోసం ఓ మహిళ తన భర్త ఇంటి ముందే పోరాటానికి దిగడం తీవ్రంగా కలకలం రేపింది.
కడప జిల్లా ప్రకాష్ నగర్లో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. భార్య శ్రీలక్ష్మి టీచింగ్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. తాడిపత్రికి చెందిన దిలేష్తో వివాహం జరిగిన తర్వాత వీరి కాపురం అనంతపురంలో సాగింది. అయితే.. గత మూడేళ్లుగా తన భర్త తనను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆమె ఆరోపించారు. ముఖ్యంగా.. ఆమె క్యారెక్టర్పై లేనిపోని అపవాదులు వేయడం, ఇతరులతో సంబంధాలు ఉన్నాయని చిత్రీకరించడం ద్వారా తనను మానసిక క్షోభకు గురిచేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒక విద్యావంతురాలైన మహిళగా సమాజంలో తలెత్తుకోలేకుండా చేయడమే భర్త ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు.
శ్రీలక్ష్మి మూడు నెలల గర్భవతిగా ఉన్న సమయంలో.. దిలేష్ ఆమెను కర్నూలులోని పుట్టింట్లో వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కనీసం మానవత్వం కూడా లేకుండా.. గర్భధారణ సమయంలో తోడుండాల్సిన భర్త తనను ఒంటరిని చేశారని ఆమె కన్నీరుమున్నీరయ్యారు. కొడుకు పుట్టిన తర్వాత కూడా భర్త నుంచి ఎటువంటి ఆదరణ లభించలేదని.. కనీసం బిడ్డను చూడటానికి కూడా రాలేదని ఆమె ఆరోపించారు. రెండేళ్లుగా చిన్న పిల్లాడిని పెంచుకుంటూ ఆర్థికంగా, సామాజికంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నానని ఆమె వివరించారు.
శ్రీలక్ష్మికి సంబంధించిన విద్యా అర్హత సర్టిఫికెట్లు, బంగారు ఆభరణాలు, వ్యక్తిగత వస్తువులన్నీ దిలేష్ తన వద్దే ఉంచుకున్నారిని.. వాటిని తిరిగి అడిగినప్పుడు కూడా తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తున్నారని.. ఒక రకంగా ఆమె భవిష్యత్తును తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నారని శ్రీలక్ష్మి ఆరోపించారు. తన సర్టిఫికెట్లు లేకపోవడం వల్ల ఉద్యోగ పరంగా కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆమె తెలిపారు.
దిలేష్ తనపై నిందలు వేస్తూ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించగా.. శ్రీలక్ష్మి మాత్రం తనకు విడాకులు ఇష్టం లేదని.. తన కాపురం నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రకాష్ నగర్లోని భర్త ఇంటి ముందు కుటుంబ సభ్యులతో కలిసి ఆమె బైఠాయించారు. ఈ సమయంలో దిలేష్ బంధువులు కూడా ఆమెపై అసభ్యకరంగా ప్రవర్తించారని.. నిందలు వేశారని ఆమె వాపోయారు. తన బిడ్డ భవిష్యత్తు కోసమైనా తనకు జరిగిన అన్యాయంపై పోలీసులు, న్యాయస్థానం స్పందించి తగిన న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.
ALSO READ: ముక్కులు చెల్లించే ఉత్సాహం.. ఐదుగురు భక్తుల ప్రాణాల మీదకు తెచ్చిన వైనం