Konaseema Gas Leak:అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలో ఓఎన్జీసీ డ్రిల్ సైట్ లో గ్యాస్ లీకై భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఈ ప్రమాదంపై మంత్రులు అచ్చెన్నాయుడు, వాసంశెట్టి సుభాష్, అధికారులతో సీఎం మాట్లాడారు. ఇప్పటికే గ్యాస్ లీకేజీపై స్థానిక అధికారులతో మాట్లాడి సహాయ చర్యలను ముమ్మరం చేసినట్లు మంత్రులు సీఎంకు వివరించారు. గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
మంటలను వీలైనంత త్వరగా అదుపులోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. కోనసీమ జిల్లా అధికారులు, ఓఎన్జీసీ ప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని మంత్రులకు సూచించారు. గ్యాస్ లీకేజీపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.
కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ డ్రిల్ సైట్ నుంచి భారీగా గ్యాస్ లీకవుతుంది. మలికిపురం మండలం ఇరుసుమండలో సుమారు 2 గంటలుగా గ్యాస్ లీకై.. మంటలు చెలరేగాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన తహసీల్దార్ ఓఎన్జీసీ అధికారులు సమాచారం అందించారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
గ్యాస్ లీకేజీ సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ డా.ఆర్.మహేష్ కుమర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తాజా పరిస్థితిపై అధికారులతో సమీక్ష చేస్తున్నారు. గ్యాస్ లీకేజీని ఆపేందుకు సహాయక సిబ్బంది, సాంకేతిక నిపుణులు ప్రయత్నిస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచనలు చేశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
Also Read: ఇరుసుమండ ఓఎన్జీసీ సైట్ లో భారీగా గ్యాస్ లీక్.. ఎగిసిపడుతున్న మంటలు
గ్యాస్ లీకేజీపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా తీశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్ లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తక్షణమే ఓఎన్జీసీ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి మంటలను అదుపులోకి తెచ్చేలా చూడాలని సూచించారు. స్థానిక ఎమ్మెల్యే దేవవర ప్రసాద్,ఎంపీ హరీశ్ కూడా ఘటనాస్థలికి చేరుకున్నారు.