Chutney Lizard: ఆహార ప్రియుల ఆరోగ్యంతో ఆటలాడుకునే వ్యాపారుల నిర్లక్ష్యానికి ప్రొద్దుటూరులో చోటుచేసుకున్న ఈ ఘటనే ప్రత్యక్ష నిదర్శనం. ప్రొద్దుటూరు పట్టణంలోని ఒకటో పోలీస్స్టేషన్ సర్కిల్ వద్ద ఉన్న ‘లక్ష్మీగణేష్’ హోటల్లో శుక్రవారం ఉదయం ఒక షాకింగ్ సంఘటన జరిగింది. పట్టణానికి చెందిన సోహెల్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యుల కోసం ఈ హోటల్ నుంచి టిఫిన్ పార్సెల్ తీసుకెళ్లారు. ఆ పార్సెల్లోని చట్నీని ఆయన భార్య తింటుండగా అందులో చనిపోయిన బల్లి కనిపించడంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఫిర్యాదు చేసినా మారని ధోరణి.. భగ్గుమన్న బాధితుడు
చట్నీలో బల్లి వచ్చిన విషయాన్ని వెంటనే హోటల్ యజమాని పెద్దిరెడ్డి సత్యనారాయణ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన ఏమాత్రం బాధ్యత లేకుండా సమాధానమిచ్చారు. అంతేకాకుండా ఆ కలుషిత చట్నీని పారబోయకుండా, మిగతా వినియోగదారులకు కూడా అలాగే వడ్డిస్తుండటంతో సోహెల్ యజమానిని నిలదీశారు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ గొడవను గమనించిన స్థానికులు, కస్టమర్లు హోటల్ నిర్వాహకుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలికి అప్పటికే అస్వస్థత కలగడంతో ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
రంగంలోకి అధికారులు.. హోటల్ సీజ్
సమాచారం అందుకున్న వన్ టౌన్ సీఐ కొండారెడ్డి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన హోటల్ యజమానిని పోలీస్ స్టేషన్కు తరలించి, దుకాణాన్ని తాత్కాలికంగా మూయించారు. అనంతరం ఆహార భద్రతా తనిఖీ అధికారిణి (FSO) హరితకు సమాచారం అందించగా, ఆమె తన బృందంతో కలిసి హోటల్ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో హోటల్ వంటగది మరియు పరిసరాలు అత్యంత అపరిశుభ్రంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అక్కడ లభ్యమైన ఆహార పదార్థాలను సీజ్ చేసి, చట్నీ శాంపిల్స్ను రసాయన పరీక్షల కోసం ల్యాబ్కు పంపించారు.
రూ. 15 వేల జరిమానా.. నిర్వాహకులపై కేసు నమోదు
హోటల్లో నిబంధనలకు విరుద్ధంగా, ప్రజారోగ్యానికి భంగం కలిగించేలా ప్రవర్తించినందుకు గానూ యజమానికి రూ. 15,000 ఫైన్ విధించారు. అంతేకాకుండా సదరు హోటల్ లైసెన్స్ను అధికారులు రద్దు చేశారు. ఈ తనిఖీల్లో ప్రొద్దుటూరు మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ మంజునాథగౌడ, పారిశుధ్య అధికారి నూర్బాషా పాల్గొన్నారు. హోటల్ యజమాని పెద్దిరెడ్డి సత్యనారాయణ రెడ్డితో పాటు వంట మాస్టర్ ఇమ్రాన్లపై ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. హోటళ్లలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు.
Also Read: ఆకలి తీర్చడమే నేరమైందా.. ఢిల్లీ విద్యార్థులకు అన్నం పెట్టినందుకు ఇల్లంతా అరెస్టే.. అసలేం జరిగింది?