Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయి. దీని కారణంగా మంగళవారం నుంచి శుక్రవారం మధ్య భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావం ఏపీ-తెలంగాణ రాష్ట్రాలపై పడనుంది. వర్షాలు పడే సమయంలో ఉరుములు-మెరుపులు, బలమైన గాలులు వీస్తాయని తెలిపింది.
వాయువ్య బంగాళాఖాతంలో ఎగువన తుఫాను వలయం ఏర్పడింది. అది క్రమంగా అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది వాతావరణ కేంద్రం. దీని ప్రభావంతో మంగళవారం నుంచి శుక్రవారం మధ్య ఒడిషా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది.
అమరావతి-హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు విడుదల చేసిన తాజా సూచనల ప్రకారం.. ఆగస్టు 10 నుంచి ఆగస్టు 17 వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయని తెలిపాయి. కొన్ని ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
ఈ అల్పపీడనానికి తోడు మరో అల్పపీడనం బుధవారం ఏర్పడే అవకాశముందని సూచనప్రాయంగా తెలిపింది. ఏపీ-తెలంగాణ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. మంగళవారం నుంచి శనివారం వరకు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. మంగళవారం పార్వతీపురం మన్యం, అల్లూరి విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పోలవరం, కాకినాడ, శ్రీ సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
ALSO READ: వైసీపీ ఫ్లెక్సీలో కేటీఆర్ ప్రత్యక్షం.. ఏలూరు ర్యాలీలో అసలేం జరుగుతోంది?
పిడుగులు పడే సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలియజేసింది డిజాస్టర్ మేనేజ్మెంట్. కొన్ని చోట్ల గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలో ఆగస్టు 10 నుంచి 17 వరకు వాతావరణ ఒకేలా ఉంటుందని పేర్కొంది. రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.