పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఈసారి ఎవరికి పట్టం గట్టనున్నాయి? ఈ ఎన్నికల్లో జెన్జీ ప్రభావం క్రియాశీలకంగా ఉంటుందనే చర్చ మొదలైంది. తెలంగాణలో త్వరలో రెండు పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. మహబూబ్నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్, వరంగల్ – ఖమ్మం – నల్గొండ నియోజకవర్గాలకు 2027 మార్చితో పదవీకాలం ముగియనున్నది. దీనికి సంబంధించిన ఓటరు నమోదు (గ్రాడ్యుయేట్ ఎన్రోల్మెంట్) ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది.
బీఆరెస్, బీజేపీ, కాంగ్రెస్ .. ఈ మూడు పార్టీలు ఈ రెండు ఎమ్మెల్సీలపై ప్రధాన దృష్టిని కేంద్రీకరించాయి. మహబూబ్నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ నియోజకవర్గం నుంచి దివంగత ప్రధాని పీవీ నర్సింహారావు తనయ సురభి శ్రీవాణి ప్రాతినిధ్యం వహిస్తుండగా.. వరంగల్- ఖమ్మం- నల్గొండ నియోజకవర్గాల నుంచి తీన్మార్ మల్లన్న ప్రాతనిధ్యం వహిస్తున్నారు.
2025, మార్చి 5న జరిగిన కరీంనగర్- మెదక్-నిజామాబాద్- ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి ఘన విజయం సాధించారు. అధికార పార్టీ క్యాండిడేట్ గట్టి ప్రయత్నాలే చేసినా ఫలించలేదు. అయితే ఈ సారి పట్టభద్రులు ఎవరి వైపు ఉంటారనే చర్చ మొదలైంది. వాస్తవానికి, అంజిరెడ్డి గెలుపు జెన్జీ గెలుపుగానే చూడాలి. అంటే జెన్జీ మొత్తం బీజేపీకి అనుకూలంగా ఉందనే సంకేతం అంజిరెడ్డి గెలుపు ద్వారా వచ్చినట్టయ్యింది.
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడో స్థానాలకే పరిమితమవుతుండగా.. పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం స్పీడ్ అందుకుంటున్నది. దీనికి కారణం… మోడీ ప్రభంజనమే. కానీ ఇప్పుడు అదే సీన్ రిపీట్ అవుతుందా? మొన్నటి జంతర్ మంతర్ జెన్జీ ఉద్యమం కాషాయ శిబిరంలో కొంత కలవరపాటుకు గురి చేశాయి. యువత బీజేపీ నుంచి పక్కదారి పడుతున్నారా? ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ను ఎంచుకుంటున్నారా? అనే అభిప్రాయాలు కూడా వినవస్తున్నాయి.
బీఆరెస్ సైతం జెన్జీ రాగం అందుకుంటోంది. కాంగ్రెస్ ఏకంగా.. జెన్జీలకు చట్టసభల్లో అవకాశాలు కల్పించేందుకు ముందుకు వస్తోంది. కేంద్రంలో విద్యాశాఖ మంత్రిగా జెన్జీకే ఇచ్చేలా చేస్తామని కూడా హామీ ఇచ్చి ఉన్నది. ఈ నేపథ్యంలో అంతా జెన్జీ పై ఆశలు పెట్టుకుంటున్న తరుణంలో ఏ పార్టీకి ఎంత కలిసి వస్తుంది? ఎవరితో యువత కలిసి నడుస్తారు? ఈ పట్టభద్రులంతా కలిసి ఎవరికి పట్టం గడుతారు? అనే అంశం అన్ని పార్టీలను కలరవపెడుతున్నది.