AP : జకియా ఖానం. ఏపీ పాలిటిక్స్లో రీసౌండ్ వస్తున్న పేరు. మండలి డిప్యూటీ ఛైర్పర్సన్కు రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవితో పాటు వైసీపీని కూడా వదిలేశారు. కొన్ని గంటల గ్యాప్లోనే బీజేపీలో చేరిపోయారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి స్వయంగా కాషాయ కండువా కప్పి పార్టీలోని సాదరంగా ఆహ్వానించారు. ఇదీ మేటర్.
జకియా చేరికపై డివైడ్ టాక్
పైపైన చూస్తే ఇది రొటీన్ పొలిటికల్ న్యూస్లానే అనిపిస్తుంది. కానీ, ఇందులో రెండు ముఖ్యమైన అంశాలు దాగున్నాయి. ఒకటి.. ప్రస్తుత పరిస్థితుల్లో ఓ బలమైన ముస్లిం నాయకురాలు బీజేపీలో చేరడం మామూలు విషయం కాదు. రెండు.. అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జకియా లాంటి లీడర్ను పార్టీలో చేర్చుకోవడంపై డివైడ్ టాక్ వినిపిస్తోంది. ఈ రెండు అంశాలపై ఏపీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
ఆ వర్గం ఓట్ల కోసమేనా?
బీజేపీపై ముస్లిం వ్యతిరేక పార్టీ అనే ముద్ర వేశారు. ఎవరెంత కాదన్నా.. ముస్లిం వర్గం ఆ పార్టీని ఎప్పుడూ అనుమానంగానే చూస్తూ ఉంటుంది. అయితే, బీజేపీ ఎన్నడూ తాము ఓ వర్గానికి అనుకూలమనో, మరో వర్గానికి వ్యతిరేకమనో ఓపెన్గా చెప్పింది లేదు. కాకపోతే, సోషల్ మీడియా పోస్టులు బీజేపీని హిందుత్వ పార్టీగా మార్చేశాయి. ముస్లింలు దూరం జరిగేలా చేశాయి. ఏపీలో హిందూ-ముస్లిం అనే వర్గ బేధం అంతగా ఉండదు. రెండు వర్గాలు బాగానే కలిసిపోతుంటాయి. అయినా, లోలోన ఏదో అనుమానం. లేటెస్ట్గా మాజీ వైసీపీ నేత జకియా ఖానం బీజేపీలో చేరడంతో ఆ వర్గం ప్రజలు కాషాయ పార్టీపై కాస్తైనా కన్సర్న్ చూపించే ఛాన్స్ ఉండొచ్చని అంటున్నారు. ప్రస్తుత సమయంలో బీజేపీలో జకియా చేరిక ఆ పార్టీకి ఎంతోకొంత లాభదాయకమే కావొచ్చు.
ఏం మెసేజ్ ఇస్తున్నట్టు?
ఐదేళ్ల క్రితం గవర్నర్ కోటాలో మండలికి నామినేట్ అయ్యారు జకియా ఖానం. డిప్యూటీ ఛైర్పర్సన్ కూడా అయ్యారు. పదవులన్నీ అనుభవించి.. టర్మ్ ముగిసే ముందు వైసీపీకి రాజీనామా చేశారు. టీడీపీ, జనసేనలో చేరేందుకు ట్రై చేశారని.. అక్కడ ఆమెకు నో ఎంట్రీ బోర్డు పెట్టడంతో.. ఇక చేసేదేం లేక బీజేపీ తలుపు తట్టారని అంటున్నారు. ఎవరొచ్చినా తీసేసుకుంటాం అనే ధోరణిలో దుకాణం తెరిచిన కాషాయ దళం.. జకియాకు వెంటనే పార్టీ కండువా కప్పేశారని చెబుతున్నారు. అయితే, ఆమె బ్యాక్గ్రౌండ్ చెక్ చేశారో లేదో అనే డౌట్ కూడా ఉంది. తిరుమల దర్శనం టికెట్లు అమ్ముకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కేసు కూడా నమోదైంది. ఎమ్మెల్సీ సిఫార్సు లేఖపై రూ.500 వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు ఒక్కోటి రూ.10 వేలకు అమ్ముకున్నారనేది జకియాపై ఉన్న కంప్లైంట్. ఇలాంటి ఆరోపణలు ఉన్న నాయకురాలిని.. వస్తాననగానే పార్టీలో చేర్చుకోవడం ఏంటని బీజేపీ కేడర్లోనే వ్యతిరేకత కనిపిస్తోంది. శ్రీవారి దర్శనం టికెట్లు అమ్ముకున్న వారిని పార్టీలో చేర్చుకుని.. తిరుమల సంరక్షణ కోసం పోరాడుతున్న పార్టీ శ్రేణులకు ఏం మెసేజ్ ఇస్తున్నారంటూ అధిష్టానం పెద్దలపై అసహనం వ్యక్తం అవుతోంది.
Also Read : వైఎస్ భారతి సన్నిహితుడికి లిక్కర్ స్కాం సొమ్ము 1000 కోట్లు?