Modi : ప్రధాని మోదీ విశాఖ పర్యటన ఖరారైంది. ఈ టూర్ లో మోదీ 14 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించే అవకాశం ఉంది. రూ.10, 842 కోట్లతో చేపట్టిన, చేపట్టబోతున్న 8 ప్రాజెక్టులకు సంబంధించిన కార్యక్రమాలకు పీఎంవో నుంచి అనుమతి లభించింది. రెండు మూడు రోజుల్లో మిగిలిన ప్రాజెక్టుల కార్యక్రమాలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చే అవకాశాలున్నాయి. నవంబర్ 11న మోదీ విశాఖకు వస్తారు. అక్కడి నుంచి నేరుగా తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రానికి చేరుకుని ఐఎన్ఎస్ చోళలో మోదీ రాత్రి బస చేస్తారు. నవంబర్ 12న ఉదయం ఏయూ గ్రౌండ్స్కు చేరుకుని.. అక్కడి నుంచే భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుడతారు.
14 ప్రాజెక్టులకు ప్రధాని వర్చువల్ విధానంలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఇందులో రైల్వే శాఖకు సంబంధించి ప్రాజెక్టులు 2, ఫిషరీస్ ప్రాజెక్టు ఒకటి, రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ప్రాజెక్టులు 3, పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మినిస్ట్రీకి సంబంధించిన 2 ప్రాజెక్టులున్నాయి. ప్రధానమంత్రి హోదాలో మోదీ మూడోసారి విశాఖకు వస్తున్నారు. 2016లో భారత నౌకాదళం ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్నారు. అప్పుడు తొలిసారి విశాఖలో పర్యటించారు. 2019 ఎన్నికల సమయంలో ఆ ఏడాది మార్చిలో రైల్వే గ్రౌండ్స్లో నిర్వహించిన సభకు హాజరయ్యారు. ప్రధాని మూడోసారి విశాఖకు వస్తున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏయూ మైదానంలో బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అక్కడి నుంచే ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.