
Nara Bhuvaneshwari about Chandrababu(Andhra pradesh today news):
టీడీపీ అధినేత చంద్రబాబు భద్రతపై ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబును కుటుంబసభ్యులు కలిశారు. ఆయనతో భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి అరగంటపాటు మాట్లాడారు. బయటకు వచ్చిన తర్వాత భువనేశ్వరి ఆవేదనతో కనిపించారు. తన మనసులో వ్యక్తమైన అనుమానాలను బయటపెట్టారు. చంద్రబాబు భద్రతపై తనకు భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజలే తనకు ముఖ్యమని చంద్రబాబు ఎప్పుడూ అంటారని భువనేశ్వరి చెప్పారు. జైలులోనూ ప్రజల గురించే ఆలోచిస్తున్నారని తెలిపారు. ఎప్పుడూ ప్రజల హక్కుల కోసమే పోరాటం చేస్తున్నారన్నారు. తాను బాగున్నానని.. ఎవరూ భయపడ వద్దని చంద్రబాబు చెప్పారని భువనేశ్వరి వెల్లడించారు. తమ కుటుంబం ఎప్పుడూ ప్రజలకు, టీడీపీ శ్రేణులకు అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. తెలుగుదేశం ఎన్టీఆర్ పెట్టిన పార్టీ అని ఎప్పటికీ ఉంటుందన్నారు. తమ కుటుంబానికి ప్రస్తుతం చాలా కష్ణకాలమన్నారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు అండగా ఉండాలని భువనేశ్వరి కోరారు.
రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు నిర్మించిన భవనంలోనే ఆయన్ను తీసుకెళ్లి పెట్టారని భువనేశ్వరి ఆవేదన చెందారు. ములాఖత్ తర్వాత బయటకు వస్తుంటే తన మనసు చలించిపోయిందన్నారు. ఏదో వదిలేసి వచ్చాననే భావన కలిగిందని.. ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఊహించలేదని భావోద్వేగం చెందారు. చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉందని.. ధైర్యంగా ఉన్నారని వెల్లడించారు. కానీ ఆయన జైలులో చన్నీళ్ల స్నానం చేయాల్సి వస్తోందని ఈ పరిస్థితి చాలా దారుణమంటూ భువనేశ్వరి కన్నీటి పర్యంతమయ్యారు.
రాజమండ్రిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సత్యమే గెలుస్తుందని అధైర్య పడవద్దన్నారు.
Atchan Naidu : జగన్ సామాజికవర్గానికే పెద్దపీట.. మిగిలిన వారికి కత్తిపీట : అచ్చెన్నాయుడు