Nara Chandrababu Naidu : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పటల్ నుంచి డిశ్చార్జి అయ్యారు. వైద్య పరీక్షల కోసం గురువారం గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రిలో ఆయన చేరారు . పరీక్షలు పూర్తైన తర్వాత ఏఐజీ వైద్యులు ఆయనను డిశ్చార్జి చేశారు. ఈ సమయంలో చంద్రబాబు వెంట ఆయన భార్య భువనేశ్వరి ఉన్నారు.
ఏఐజీ ఆస్పత్రిలో చంద్రబాబును గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణులు డాక్టర్ కే రాజేష్ ఆధ్వర్యంలో పరీక్షించారు. జనరల్ మెడిసిన్, కార్డియాలజీ, పల్మనాలజీ, డెర్మటాలజీ విభాగాలకు చెందిన వైద్య నిపుణులు ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. ఆ తర్వాత వివిధ వైద్య పరీక్షలు సూచించారని తెలుస్తోంది. ఈసీజీ, 2డీ ఎకో, రక్త, మూత్ర పరీక్షలు కాలేయ, మూత్రపిండాల పనితీరు పరీక్షలు, అలర్జీ స్క్రీనింగ్ టెస్టులు చేశారని సమాచారం. జైలులో ఉన్న సమయంలో చంద్రబాబు తీవ్ర అలర్జీతో బాధపడ్డారు. అనారోగ్య కారణాల వల్ల ఆయనకు మధ్యంతర బెయిల్ వచ్చింది. ఈ క్రమంలోనే మంగళవారం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన ఆయన బుధవారం హైదరాబాద్ చేరుకున్నారు. ఆ తర్వాత ఏఐజీలో చేరారు.
ఏఐజీ నుంచి డిశ్చార్జి అయిన తర్వాత జూబ్లీహిల్స్లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి చంద్రబాబు వెళ్లతారని తెలుస్తోంది.అక్కడే కంటి వైద్యులు చంద్రబాబుకు శస్త్రచికిత్స చేసే అవకాశం ఉందని సమాచారం.