Nara Lokesh : వైసీపీ ప్రభుత్వ హయాంలో అడుగడుగునా లంచాలు, అక్రమాలే రాజ్యమేలాయంటూ ఆరోపిస్తూ వస్తున్న టీడీపీ నేతలు.. తాజాగా మరో బాంబు పేల్చారు. రాష్ట్రానికి పెట్టుబడులు పెడతామని వచ్చిన పారిశ్రామిక వేత్తల నుంచి సైతం వైసీపీ పాలకులు లంచాలు అడిగారంటూ మంత్రి నారా లోకేష్ సంచలన విమర్శలు చేశారు. పెట్టుబడులు పెట్టే వారికి ప్రభుత్వం తరఫున కల్పించే రాయితీల్లో 50 శాతం లంచంగా అడిగే వారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కారణంగానే.. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది వెనుకడుగు వేశారని మంత్రి వెల్లడించారు. ఆ ప్రభావం ఇప్పుడూ కాస్త కనిపిస్తుందన్న మంత్రి నారా లోకేష్.. ఆ ప్రభావాన్ని తొలగించేందుకు కృషి చేస్తున్నామన్నారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి పరిపాలనలో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించామన్న నారా లోకేష్.. వైసీపీ పాలనలో మాత్రం ఎలాంటి ప్రగతి జరగలేదని, ఎలాంటి కొత్త పరిశ్రమలు ఏర్పాటు కాలేదని అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరైనా ముందుకు వచ్చిన వారి దగ్గర నుంచి లంచాలు డిమాండ్ చేసి పారిశ్రామికవేత్తలను తరిమేసారంటూ ఆగ్రహించారు. వైసీపీ నేతలు లంచాలు అడిగిన విషయం దిల్లీ స్థాయిలో చర్చకు దారితీసిందన్న మంత్రి నారా లోకేష్.. ఇటీవల తనను దిల్లీలో కలిసిన ఒక పారిశ్రామికవేత్తే స్వయంగా ఈ విషయం చెప్పారంటూ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో లంచలకు ఎలాంటి అవకాశం లేదని, అలాంటి పరిస్థితులను పూర్తిగా మార్చేశామంటూ హామీ ఇచ్చారు.
టీడీపీ హయాంలో గతంలోనూ ఎన్నో పరిశ్రమలు ఏర్పాటు చేసినట్లు తెలిపిన మంత్రి నారా లోకేష్.. ఇప్పుడు కూడా మళ్లీ పరిశ్రమల ఏర్పాటును వేగవంతం చేస్తున్నామని ప్రకటించారు. ఈ నెల 19వ తేదీన మళ్లపల్లి పారిశ్రామిక వాడలో అశోక్ లేల్యాండ్ యూనిట్ ను ప్రారంభించినట్లు వెల్లడించారు. రాష్ట్రానికి పెట్టుబడులు, ఉద్యోగాలు, ఉపాధి కల్పన ముఖ్యమని.. అందుకే అధికారులకు పూర్తి స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఇచ్చామని మంత్రి నారా లోకేష్ తెలిపారు.
ఎమ్మెల్యేలకు శిక్షణ
ఇటీవలి ఎన్నికల్లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టిన ప్రజాప్రతినిధులకు రాజకీయపరమైన అంశాలపై శిక్షణను అందించనున్నట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ప్రజాప్రతినిధులుగా ప్రభుత్వ నిర్వహణ, పార్టీ క్యాడర్ ను సమన్వయం చేసుకోవడంలో కొంత మంది ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్నారని తన దృష్టికి వచ్చినట్లు తెలిపిన నారా లోకేష్.. వారికి శిక్షణ ఇచ్చి ఆయా సమస్యలను అధిగమించేందుకు సాయం చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఇదే సమయంలో సీనియర్ల కంటే కొత్తగా ఎన్నికైన వారే పార్టీ విధానాలను బాగా అర్థం చేసుకుంటున్నారంటూ నారా లోకేష్ ప్రశంసించారు. కొన్ని కొన్ని విషయాల్లో పార్టీ తీసుకునే నిర్ణయాలను పాటించడంలో సీనియర్ ఎమ్మెల్యేలు తోనే ఇబ్బందులు వస్తున్నాయని, తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఒకసారి చెప్తే.. వారు అలాంటి తప్పులు మరోసారి చేయకుండా పనిచేస్తున్నారని అన్నారు.
Also Read : Minister Narayana: రాజధానిపై కీలక ప్రకటన.. టైమ్ ఫిక్స్ చేశామన్న మంత్రి నారాయణ