Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోమారు తన మంచి మనసు చాటుకున్నారు. ‘పవన్ సర్.. మా ఊరికి రోడ్డు వేయండి’ అంటూ విద్యార్ధులు సామాజిక మాధ్యమాల ద్వారా పంపిన సందేశంపై ఆయన చలించిపోయారు. బురద రోడ్డులో ప్రతి రోజు స్కూలుకు వెళ్లడానికి విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు చూసి కదిలిపోయారు. తక్షణమే అధికారులతో వివరాలు తెప్పించుకుని రోడ్డు మంజూరు చేయించారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొండాపురం మండలం గజ్జలవారిపల్లి గ్రామానికి చెందిన పాఠశాల విద్యార్ధులు రోడ్డు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బురద రోడ్డులో స్కూలుకు వెళ్లేందుకు తాము పడుతున్న ఇబ్బందులు చెప్పుకుంటూ ఇటీవల సోషల్ మీడియాలో వీడియో పెట్టారు. ఈ విషయం శుక్రవారం పవన్ దృష్టికి వచ్చినట్లు డిప్యూటీ సీఎం కార్యాలయం ఎక్స్ వేదికగా పేర్కొంది.
విద్యార్థుల అవస్థలు చూసి చలించిపోయిన పవన్.. వెంటనే నెల్లూరు జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు. ఆ గ్రామంలో రోడ్డు నిర్మాణానికి సంబంధించిన అంచనాలు రూపొందించి తక్షణమే రహదారి మంజూరు చేయాలని ఆదేశించారు. 1.6 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ. 86 లక్షలతో అంచనాలతో శాంక్షన్ ఆర్డర్ ఇచ్చారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే గజ్జలవారిపల్లె నుంచి నిత్యం స్కూళ్లకి వెళ్లే విద్యార్ధులు, పంట పొలాలకి వెళ్లే రైతుల వెతలు తీరిపోనున్నాయి.
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఉదయగిరి నియోజకవర్గం పరిధిలో ఇప్పటికే పల్లెపండగ 1.0, పల్లెపండగ 2.0తో పాటు సాస్కీ నిధులతో సుమారు రూ. 55 కోట్ల విలువ చేసే రోడ్లు అభివృద్ధి చేశారు. నెల్లూరు జిల్లా పరిధిలో ఆ నియోజకవర్గంలో మొత్తం 641 రోడ్లు నిర్మాణం చేపట్టారు. పల్లెపండగ 1.0లో రూ. 26.6 కోట్లతో 437 రోడ్ల పనులు, 2.0లో 200 రోడ్ల పనులు నిర్మాణం చేపట్టారు. సాస్కీ నిధులతో మరో నాలుగు ప్రధాన రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు.
సాస్కీ నుంచి మొత్తం రూ. 9 కోట్లు రోడ్ల కోసం వెచ్చించారు. ఈ నిధులతో దుత్తలూరు మండల పరిధిలోని డికేడీ రోడ్డు నుంచి కొత్తపేట మధ్య 6.5 కిలోమీటర్లు, కొండాపురం మండల పరిధిలో నేకునంపేట, ఇసుకపాలెం మధ్య 5.8 కిలోమీటర్లు, సీతారాంపురం మండల పరిధిలో కేయూఎస్ రోడ్డు, దేవిశెట్టిపల్లి మధ్య, వింజమూరు మండల పరిధిలో రావిపాడు అప్రోచ్ రోడ్డుల నిర్మాణానికి అనుమతులు మంజూరయ్యాయని డిప్యూటీ సీఎం కార్యాలయం ఎక్స్ వేదికగా ప్రకటించింది.
విద్యార్ధుల వేదన కదిలించింది
•సామాజిక మాధ్యమాల్లో వీడియో చూసి స్పందించిన ఉప ముఖ్యమంత్రి
•తక్షణమే గజ్జలవారిపల్లికి రోడ్డు మంజూరు
•రోడ్డు కావాలని ఉప ముఖ్యమంత్రి @PawanKalyan ను కోరుతూ సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్ట్ చేసిన గజ్జలవారిపల్లి విద్యార్ధులుపవన్ సర్.. మా ఊరికి…
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) February 7, 2026
Also Read: Medaram Jatara 2026: మేడారం భక్తుల వింత కోరికలు.. నవ్వాలో, ఏడవాలో అర్థం కాని పరిస్థితి భయ్యా!