Perni Nani: కంచే చేను మేసిన చందంగా రాష్ట్రంలో పరిపాలన సాగుతోందని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. నారా లోకేష్ ధనదాహం కోసం సహకార రంగంలో ఎంతో విజయవంతంగా నడుస్తున్న విజయా డైరీపై కుట్రలు పన్నుతున్నారని మాజీ మంత్రి మండిపడ్డారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. హెరిటేజ్ సంస్థ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి, విజయా డైరీని నాశనం చేసేందుకు కూటమి ప్రభుత్వం యత్నిస్తోందన్నారు. చైర్మన్ చలసాని ఆంజనేయులు రాజీనామా వెనుక రెడ్ బుక్ రాజ్యాంగ కుట్రలు ఉన్నాయని ఆరోపించారు.
ఐసీయూలోనే బెదిరింపులు..
మండవ జానకీ రామయ్య బాటలో నడిచిన చలసాని ఆంజనేయులు విజయా డైరీ అభివృద్ధికి ఎనలేని సేవలు అందించారని తెలిపారు. ఏటా వెయ్యి కోట్ల వ్యాపార లావాదేవీలతో సంస్థను తీర్చిదిద్దారని పేర్ని నాని తెలిపారు. దివంగత వైఎస్సార్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిల హయాంలో సహకార డైరీల అభివృద్ధికి పెద్దపీట వేశామని గుర్తుచేశారు. అయితే హెరిటేజ్ ఆస్తులను పెంచుకునే కుట్రలో భాగంగానే విజయా డైరీని దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చలసాని ఆంజనేయులును ఐసీయూలోకి వెళ్ళి మరీ ఇద్దరు మంత్రులు బెదిరింపులకు గురిచేసి రాజీనామా చేయించడం దారుణమన్నారు.
కూటమి నేతల వేధింపులతోనే గుండెనొప్పి
రాజీనామా చేయకపోతే అక్రమ కేసులు బనాయించి, కొడుకు, కూతురిని అరెస్ట్ చేయిస్తామని బెదిరించడం వల్లే ఆంజనేయులుకు గుండెనొప్పి వచ్చిందని పేర్ని నాని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన చైర్మన్ను తొలగించే హక్కు మంత్రులకు ఎక్కడిదని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ శ్రేణులపైనే కాక, పాము తన పిల్లలను తానే తిన్నట్లుగా కూటమి ప్రభుత్వం ఇప్పుడు టీడీపీ, జనసేన నాయకులపైనే వేధింపులకు దిగుతోందని విమర్శించారు.
అక్రమార్కులు ఊసలు లెక్కబెట్టడం ఖాయం
పాలు, పాల పదార్థాల విక్రయాల ద్వారా లాభాల్లో నడుస్తున్న విజయా డైరీకి చెందిన వేలకోట్ల విలువైన ఆస్తులను కబళించేందుకు లోకేష్ నాయకత్వంలో వేగంగా అడుగులు పడుతున్నాయని దుయ్యబట్టారు. సహకార సంఘాల సొత్తును అక్రమార్కుల పాలు చేయనివ్వమని స్పష్టం చేశారు. జగన్ మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వచ్చాక ఈ కుట్రలకు పాల్పడిన ప్రతి ఒక్కరినీ చట్టం ముందు నిలబెడతామని, వారు ఊసలు లెక్కబెట్టడం ఖాయమని హెచ్చరించారు.
Also Read: ఫోన్లో రీల్స్ చూస్తోందని.. భార్యను చంపి, పరుపులో చుట్టి..