PM Modi : ఇంద్రలోక రాజధాని అమరావతి అని.. అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదని.. అమరావతి ఒక శక్తి అన్నారు ప్రధాని మోదీ. ఐటీ, ఏఐ, విద్యా, ఆరోగ్య రంగాల్లో అమరావతి దేశంలోనే ప్రధాన నగరంగా ఉండబోతోందని చెప్పారు. రికార్డు స్పీడ్తో పనులన్నీ పూర్తి చేస్తామని, కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
చంద్రబాబును చూసే నేర్చుకున్నా..
తాను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు.. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్లో ఐటీని ఎలా డెవలప్ చేస్తున్నారో తాను తెలుసుకున్నానని చెప్పారు. అందుకోసం ప్రత్యేకంగా అధికారులను కూడా నియమించి చంద్రబాబు పనితీరును పరిశీలించానని అన్నారు. లార్జ్ స్కేల్లో భారీ ప్రాజెక్టులు చేపట్టాలన్నా, వాటిని వేగంగా పూర్తి చేయాలన్నా.. చంద్రబాబును మించిన వాళ్లు దేశంలోనే లేరని ప్రశంసించారు ప్రధాని మోదీ.
కలిసి పని చేద్దాం..
ఏపీ సరైన మార్గంలో, సరైన వేగంతో ముందుకు సాగుతోందన్నారు మోదీ. సీఎం చంద్రబాబు ఆకాంక్షించినట్టు.. మూడేళ్లలో అమరావతి పనులు పూర్తి చేస్తే.. ఏపీ జీడీపీ ఊహించలేని స్థాయికి పెరుగుతుందని.. అది రాష్ట్ర చరిత్రను మార్చేస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కలిసి పని చేస్తానని హామీ ఇచ్చారు ప్రధాని.
ఎన్టీఆర్ కలలు.. మనమే నిజం చేయాలి..
ఆంధ్రప్రదేశ్ పురోగతి కోసం ఎన్టీఆర్ ఎన్నో కలలు కన్నారని.. వికసిత్ అమరావతితో ఆ కలలను కూటమి ప్రభుత్వమైన మనమే నిజం చేయాలంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్లకు పిలుపు ఇచ్చారు పీఎం మోదీ. 60 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు తాను శంకుస్థాపన చేశానని.. అవి ఆంధ్రప్రదేశ్ ఆశలకు బలమైన పునాది వేస్తాయని తెలిపారు. నవ్య అమరావతి, నవ్య ఆంధ్రతో తన కల నిజం కాబోతోందన్నారు ప్రధాని మోదీ. 2015లో అమరావతికి తానే శంకుస్థాపన చేశానని.. అప్పటి నుంచీ కేంద్రం తరఫున అన్ని రకాల తోడ్పాటు అందిస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.
Also Read : మోదీ ముందే.. వైసీపీని ఆటాడేసుకున్న లోకేశ్, పవన్
తల్లీ దుర్గా భవానీ కొలువున్న పుణ్యభూమిపై మీ అందరినీ కలవడం తనకు ఆనందంగా ఉందంటూ తెలుగులో స్పీచ్ స్టార్ట్ చేశారు ప్రధాని మోదీ. అమరలింగేశ్వరుడికి, తిరుమల బాలాజీకి ప్రణామాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలుగులో చెప్పారు.