AP Police : గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వివిధ పదవుల్లో ఉండి.. అప్పటి ప్రతిపక్షమైన టీడీపీ, జనసేన పార్టీలు, ఆయా పార్టీల నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలు వరుసగా పోలీసు నోటీసులు అందుకుంటున్నారు. ఈ జాబితాలో సినీ నటుడు, వైసీపీ నేత పోసాని మురళీకృష్ణ ను పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో.. తర్వాత ఎవరికి పోలీసు నోటీసులు అందుతాయనే ఉత్కంఠ రాష్ట్రంలో నెలకొంది. ఈ సందిగ్ధతకు తెరదించుతూ.. ఏపీ పోలీసులు మాజీ ఎంపీ, వైసీపీ నేత గోరంట్ల మాధవ్ కు నోటీసులు జారీ చేశారు. దీంతో.. నెక్స్ట్ అరెస్ట్ కాబోతుంది గోరంట్ల మాధవ్ నే అనే ప్రచారం రాష్ట్రంలో ఊపందుకుంది.
2024లో ఓ అత్యాచార ఘటనలో బాధితుల పేర్లను బహిరంగంగా వెల్లడించారనే ఆరోపణలపై.. విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేసారు. వచ్చే నెల మార్చి 5న తమ ముందు విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. గతంలో పోలీస్ ఆఫీసర్ గా పని చేసిన గోరంట్ల మాధవ్.. చట్టాన్ని ధిక్కరిస్తూ అత్యాచార ఘటనలోని బాధితురాల పేర్లను బహిరంగంగా తెలిపారని 2024 నవంబర్ లో మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ గోరంట్ల మాధవ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచార ఘటనలో బాధితుల పేర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించకూడదని సుప్రీంకోర్టు తీర్పుని, చట్టాన్ని ధిక్కరిస్తూ.. గోరంట్ల మాధవ్ బాధితురాలు పేర్లను బహిరంగంగా మీడియాకు వెల్లడించారని, ఇది చట్టాన్ని అతిక్రమించడమే అని ఆవిడ ఫిర్యాదులో పేర్కొన్నారు.
పోసాని తర్వాత ఎవరు.?
మహిళా కమిషన్ మాజీ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మా ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన కేసులో విజయవాడలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాలని గోరంట్ల మాధవ్ కు పోలీసులు తెలిపారు. పోసాని మురళీకృష్ణ అరెస్ట్ నేపథ్యంలో నెక్స్ట్ ఎవరికి పోలీసులు నోటీసులు పంపిస్తారని చర్చ తీవ్రంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అనేక మంది కీలక నేతల పేర్లు ప్రచారంలో ఉండగా.. పోలీసులు మాత్రం అనూహ్యంగా గోరంట్ల మాధవ్ కు నోటీసులు జారీ చేసి, సరికొత్త చర్చకు తెరలేపారు.
టీడీపీ, జనసేనా నేతలపై వివాదాస్పద వ్యాఖ్యాలు చేసిన నేతల్లో కొంత మందిని ఇప్పటికే జైలుకు పంపిన పోలీసులు.. మిగతా వారికి వివిధ కేసుల్లో నోటీసులు అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోసాని మురళీ తర్వాత ఎవరు అని చర్చ జరుగుతుండగా.. గోరంట్ల మాధవ్ పేరు బయటకు వచ్చింది. దాంతో.. నారా లోకేష్ రెడ్ బుక్ లోని పేర్లలో గోరంట్ల మాధవ్ పేరు కూడా ఉందంటూ చెబుతున్నారు.
చట్టం గురించి తెలియదా.?
గతంలో పోలీస్ శాఖలో సీఐ హోదాలో పనిచేసిన గోరంట్ల మాధవ్ కు చట్టంపై అవగాహన ఉంది. అలాంటి వ్యక్తి అత్యాచార ఘటనలోని బాధ్యతలు వివరాలను బహిరంగ వెల్లడించడం సరైన చర్య కాదనేది విమర్శకుల మాట. అందుకే గోరంట్ల మాధవ్ పై ఫిర్యాదు చేసిన వాసిరెడ్డి పద్మ.. ఇతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసిన సమయంలో విజయవాడ సీపీని కోరారు. ప్రస్తుతం ఆ కేసులోనే గోరంట్ల మాధవ్ కు నోటీసులు జారీ అయ్యాయి. దీంతో ఎప్పుడైనా గోరంట్ల మాధవ్ కు పోలీసుల నుంచి అరెస్ట్ నోటీసులు వచ్చే అవకాశం ఉందని, ఆయన జైలుకు పంపించేందుకు పోలీసులు పకడ్బందీగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
Also Read : Posani vs Pawan: పవన్ భార్యపై దారుణమైన వ్యాఖ్యలు.. ఆ కామెంట్సే పోసాని కొంప ముంచాయా?
బాధితుల గోప్యతను కాపాడటం అత్యంత ముఖ్యమైన విషయం. ముఖ్యంగా అత్యాచారం వంటి ఘటనల్లో బాధితుల పేర్లు, ఇతర విషయాలు బయటకు వెళితే.. వారి జీవనానికి కష్టం అవుతుందని, వారు సమాజంలో ఆత్మనూన్యతను ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ నిబంధనను ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు తీర్పుతో, పార్లమెంట్ చట్టం రూపంలో ఈ నిబంధనలు దేశంలో అమల్లో ఉన్నాయి. అయినా.. అధికారం ఉందనే ధైర్యంతో.. ఇలా వ్యవహరించడం సరైంది కాదంటున్నారు విమర్శకులు.