Jos Buttler: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) విజేతగా రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు (RCB) నిలిచిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మే 31వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరిగింది. అయితే ఇందులో గుజరాత్ టైటాన్స్ 155 పరుగులు చేసిన నేపథ్యంలో సులభంగా బెంగళూరు గెలిచింది. మరో 20 నుంచి 30 పరుగులు చేసి ఉంటే గుజరాత్ విక్టరీ సాధించేదని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇలాంటి క్రమంలో గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ కోచ్ ఆశిష్ నెహ్రా పైన (Ashish Nehra) వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు అదే జట్టుకు సంబంధించిన జోస్ బట్లర్. తనను నెంబర్ 3లో కాకుండా.. ఫైనల్స్ లో బ్యాటింగ్ మార్చి నెంబర్ ఫోర్ లో పంపించారని.. దానివల్ల గుజరాత్ టైటాన్స్ ఓడిపోవలసి వచ్చిందని పరోక్షంగా జోస్ బట్లర్ షాకింగ్ నిజాలను పంచుకున్నారు. దీని వెనుక కుట్ర చేసింది ఆశిష్ నెహ్రా అంటూ బాంబు పేల్చారు. దీంతో స్టువర్ట్ బ్రాడ్ (Stuart Broad) చేసిన ఇంటర్వ్యూలో గుజరాత్ టైటాన్స్ ఆటగాడు జోస్ బట్లర్ (Jos Buttler ) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ మే 31వ తేదీన జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయిన గుజరాత్ టైటాన్స్, మొదట బ్యాటింగ్ చేసింది. అయితే గుజరాత్ జట్టును ఫైనల్ దాకా తీసుకువచ్చింది టాప్ ఆర్డర్ ఆటగాళ్లు సాయి సుదర్శన్, గిల్ అలాగే జోస్ బట్లర్. అయితే ఫైనల్ మ్యాచ్లో సాయి సుదర్శన్ తో పాటు గిల్ విఫలమయ్యారు. ఈ క్రమంలో మూడో స్థానంలో రావాల్సిన జోస్ బట్లర్, నాలుగో స్థానంలో వచ్చాడు. మూడో స్థానంలో నిశాంత్ సింధు బ్యాటింగ్ కు దిగి విఫలం అయ్యాడు. ఈ క్రమంలో నాలుగో స్థానంలో వచ్చిన బట్లర్ కూడా పెద్దగా రాణించలేకపోయాడు. ఎప్పటిలాగా మూడో స్థానంలో బట్లర్ వస్తే సీన్ వేరేలా ఉండేది. కచ్చితంగా 50 పరుగులకు పైగా బట్లర్ చేసేవాడు. ఓవరాల్ గా జట్టు స్కోరును 180 నుంచి 200 వరకు తీసుకువెళ్లే ఛాన్స్ ఉండేది. కానీ నాలుగో స్థానంలో పంపడంతో… గుజరాత్ అట్టర్ ఫ్లాప్ అయింది.
నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు రావడం పై తాజాగా జోస్ బట్లర్ సంచలన కామెంట్ చేశారు. వికెట్ పడగానే మూడవ స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని.. హెల్మెట్ పెట్టుకుని వెళ్లే క్రమంలో ఆశిష్ నెహ్రా తనకు బ్రేకులు వేశారని ఫైర్ అయ్యారు. తనను కాదని… సింధు పంపించినట్లు వెల్లడించారు. ఆశిష్ నెహ్రానే గిల్ తో కలిసి, ఈ ప్లాన్ చేసినట్లు ఆరోపించారు. ఆ ఒక్క నిర్ణయంతో మ్యాచ్ స్వరూపం మారిపోయిందని సీరియస్ అయ్యారు. దీంతో బట్లర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.