Tirumala Laddu: కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం అనంతరం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వీకరించే ప్రపాదం శ్రీవారి లడ్డూ. ప్రసాదం విక్రయాలు ఈ సంవత్సరం మే నెలలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. తిరుమలలో రోజు రోజుకు భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో టీటీడీ లడ్డూ ఉత్పత్తిని ఎక్కవగా పెంచి, భక్తులకు ఎలాంటి కొరత లేకుండా ప్రసాదాలను టీటీడీ అందిస్తోంది. ఈ ఏడాది మే నెలలో ఎకంగా మొత్తం 1,21,35,528 లడ్డూలు విక్రయమయ్యాయి. గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది లడ్డూల విక్రయాలు గణనీయంగా పెరిగాయి. 2024 మే నెలలో 1.01 కోట్ల లడ్డూలు విక్రయమవ్వగా.. 2025లో 1.10 కోట్లకు పెరిగాయి. ప్రస్తుతం 2026లో 1.21 కోట్లకు పైగా విక్రయాలు నమోదవడం విశేషం.
శ్రీవారి ప్రసాదాల తయారీలో నాణ్యతకు అత్యున్నత ప్రాధాన్యతను ఇస్తున్నారు. టీటీడీ రోజుకు సగటున 4.08 లక్షల లడ్డూలను తయారు చేస్తుంది. సాధారణ రోజుల్లో ఐతే 4 లక్షల నుండి 4.5 లక్షల వరకు లడ్డూలు తయారు చేస్తారు. అయితే ప్రత్యేక సందర్భాల్లో మాత్రం ఉత్పత్తిని మరింత పెంచుతారు.
అత్యంత పవిత్రమైన శ్రీవారి ప్రసాదమైన లడ్డూల తయారీ కోసం రోజువారీగా 68 టన్నులకు పైగా ముడి పదార్థాలను టీటీడీ లడ్డూలో వినియోగిస్తోంది. లడ్డూ తయారీకి రోజుకు సుమారుగా కనీసం 32 టన్నుల చక్కెర, 16 టన్నుల శెనగపిండి, 16 టన్నుల నెయ్యి, 3.5 టన్నుల జీడిపప్పు, 2 టన్నుల ఎండుద్రాక్ష, 400 కిలోల యాలకులు, 800 కిలోల కలకండ వినియోగిస్తున్నారు. ఒక్క చిన్న లడ్డూ తయారీకి సగటున 167 నుండి 170 గ్రాముల ముడి పదార్థాలను ఉపయోగిస్తున్నారు. ఇందులో సుమారు 78 గ్రాముల చక్కెర, 39 గ్రాముల శెనగపిండి, 36 గ్రాముల నెయ్యి, 7 గ్రాముల జీడిపప్పు, 3 గ్రాముల ఎండుద్రాక్ష తదితర పదార్థాలు ఉంటాయి.
Also Read: రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన “తిరుపతి లడ్డూ”కు భారత ప్రభుత్వం జియోగ్రాఫికల్ ఇండికేషన్(GI) గుర్తింపును మంజూరు చేసింది. అదేవిధంగా లడ్డూ తయారీ, విక్రయాలకు సంబంధించి ఎఫ్ఎస్ఎస్ఏఐ(FSSAI) లైసెన్స్ కూడా టీటీడీకి లభించింది. దీంతో శ్రీవారి లడ్డూ నాణ్యత, ప్రామాణికత మరింత పెంచింది.
ప్రసాదాల తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల్లో ఎలాంటి మలినాలు లేకుండా చూసేందుకు శ్రీవారి పోటులో రెండు అత్యాధునిక ఏఐ ఆధారిత కలర్ సార్టింగ్ యంత్రాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ముడి పదార్థాల్లోని మలినాలను తొలగించి అత్యుత్తమ నాణ్యత గల ముడి సరుకులను మాత్రమే లడ్డుకు ఉపయోగిస్తున్నారు. అలాగే పోటు విభాగానికి అవసరమైన అన్ని ముడి సరుకులను కొనుగోలు విభాగం సేకరించి, ప్రయోగశాల పరీక్షలు నిర్వహించిన అనంతరం వాటిని వినియోగానికి వాడుతారు.
శ్రీవారి ప్రసాదాల తయారీలో 1950, 1951 సంవత్సరాల్లో టీటీడీ ఆమోదించిన సంప్రదాయ “దిట్టం” ప్రమాణాలను నేటికీ ఖచ్చితంగా పాటిస్తున్నారు. నిత్య, వార, పక్ష, మాస, నక్షత్ర, సాలకట్ల ఉత్సవాలకు అనుగుణంగా సుమారు 20 రకాల అన్నప్రసాదాలు, 25 రకాల పణ్యారాలను సిద్ధం చేస్తున్నారు.
శ్రీవారి పోటులో రెండు షిఫ్టుల్లో సుమారు 700 మంది శ్రీవైష్ణవ బ్రాహ్మణులు భక్తి శ్రద్ధలతో 24 గంటలూ సేవలందిస్తూ లడ్డూ ప్రసాదాల తయారీలో పాల్గొంటున్నారు. వీరికి టీటీడీ సిబ్బంది, పర్యవేక్షకులు సహకరిస్తున్నారు.
Also Read: అశ్వారావుపేటలో కోట్ల విలువైన సర్కారు భూమి మాయం.. ప్రైవేట్ వ్యక్తులకు 15 ఎకరాలు అమ్మేసిన శ్రీమంతుడు!
లడ్డూ తయారీ ప్రక్రియలో భాగంగా బూంది పోటు, పడి పోటు, అదనపు పోటు, అంతర్గత పోటు వంటి ప్రత్యేక విభాగాలు పనిచేస్తున్నాయి. రోజుకు 15 టన్నుల శెనగపప్పును పిండిగా మార్చే ఫ్లోర్ మిల్, 2,10, 000 కిలోల సామర్థ్యం గల నెయ్యి నిల్వ ట్యాంకులు, 30 టన్నుల సామర్థ్యం గల గ్యాస్ ప్లాంట్, 2 నుండి 7 రోజుల వరకు ముడి సరుకులు నిల్వ ఉంచగల ఉగ్రాణం, కన్వేయర్ బెల్ట్ వ్యవస్థ ద్వారా బూంది తరలింపు వంటి ఆధునిక సదుపాయాలు అందుబాటులో వారికి ఉన్నాయి.
తిరుమలలోని లడ్డూ కాంప్లెక్స్లో 56 కౌంటర్ల ద్వారా మొత్తం మూడు షిఫ్టుల్లో 24 గంటలూ లడ్డూల విక్రయం చేస్తుంటారు. అదనపు లడ్డూల కొనుగోలు కోసం డిజిటల్ చెల్లింపులతో పనిచేసే కియోస్క్ యంత్రాలను కూడా అక్కడ ఏర్పాటు చేశారు. దర్శనం పొందిన ప్రతి భక్తునికి ఒక లడ్డూను ఉచితంగా అందజేస్తారు.
భక్తుల రద్దీ అధికంగా ఉండే రోజుల్లో ఎలాంటి కొరత రాకుండా 8 లక్షల నుండి 10 లక్షల లడ్డూల వరకు బఫర్ స్టాక్ సిద్ధంగా ఉంచుతున్నారు. దీంతో భక్తులకు ఇబ్బంది కలగకుండా ముందే జాగ్రత్త పడుతారు.
ఇటీవలి కాలంలో శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యత, రుచి మరింత మెరుగుపడటంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత, సంప్రదాయం, భక్తి భావనల సమ్మేళనంగా నిలిచిన శ్రీవారి లడ్డూ ప్రసాదం తిరుమల మహత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెబుతోంది.
Also Read: కాకరేపుతున్న తెలంగాణ పాలిటిక్స్.. మళ్లీ ప్రాంతీయ బేస్లో పొలిటికల్ వార్..?