Poonam Kaur: తెలుగు చిత్రసీమలో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి పూనమ్ కౌర్ తాజాగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను ధైర్యంగా చెప్పే ఆమె, తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ప్రత్యేకంగా కలిసింది. ఈ భేటీలో ఆమె చంద్రబాబుకు ఒక ప్రత్యేక ఆర్ట్ వర్క్ను బహుమతిగా అందించింది. అమరావతి అభివృద్ధిని ప్రతిబింబించేలా రూపొందించిన ఆ ఆర్ట్ వర్క్కు మంచి స్పందన లభిస్తోంది.
ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, సినీ ప్రేమికులతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా పూనమ్ పేరు మళ్లీ హాట్ టాపిక్గా మారింది. చంద్రబాబుతో ఆమె కలసిన ఫోటోను చూసి చాలా మంది ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎందుకంటే పూనమ్ చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ, తక్కువగా కనిపిస్తోంది.
టాలీవుడ్ నుంచి రాజకీయ చర్చల దాకా…
పూనమ్ కౌర్ కెరీర్ ప్రారంభంలోనే మంచి గుర్తింపు పొందింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించి, తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే నెమ్మదిగా కథానాయిక పాత్రల నుంచి సహాయక పాత్రలకే పరిమితమై పోయింది. 2018 తర్వాత సినిమాలకు దూరంగా ఉండిపోయింది. కానీ సామాజిక మాధ్యమాల్లో మాత్రం తను చాలా యాక్టివ్ గా ఉంటూ, సమాజంలో జరుగుతున్న అంశాలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తోంది.
ప్రస్తుతం టాలీవుడ్కు చెందిన ఓ ప్రముఖ దర్శకుడిపై తరచూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. తనకు న్యాయం జరగలేదని, కొన్ని వర్గాలు తనపై అనవసర ఒత్తిడి తెచ్చాయని పూనమ్ కౌర్ చాలా సందర్భాల్లో స్పష్టం చేసింది. ఆమె వ్యాఖ్యల వల్ల ఓ దర్శకుడి పేరు పలు సందర్భాల్లో వార్తల్లోకెక్కింది.
ఆరోగ్య సమస్యలతోనేనా?
ఈ మధ్యకాలంలో బయట కనిపించిన పూనమ్ కౌర్ గణనీయంగా బొద్దుగా మారిపోయిందన్న చర్చలు నెట్టింట మొదలయ్యాయి. కొంతమంది అభిమానులు ఆమె అనారోగ్యంతో బాధపడుతోందని కామెంట్లు పెడుతూ, ఆమె ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే గతంలో తన ఆరోగ్య పరిస్థితిపై పూనమ్ స్పందించింది. తాను ఫుడ్ అలర్జీ సమస్యతో పాటు ఫైబ్రోమయాల్జియా అనే వ్యాధితో బాధపడుతున్నానని చెప్పింది. ఇది శరీరంలోని నరాల, మానసిక ఒత్తిడి కారణంగా వచ్చే దీర్ఘకాలిక వ్యాధి. దీని వల్ల శరీరం ఉబ్బి కనిపించవచ్చు. తను లావుగా కనిపించడానికిదే కారణమని పూనమ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. ఈ విషయంపైనే తాజాగా ఆమె చంద్రబాబుతో ఉన్న ఫోటోలపై రియాక్ట్ అవుతున్న నెటిజన్లు.. ఆమె ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని విమర్శించవద్దని సూచిస్తున్నారు.
రాజకీయాల్లోకి అడుగులు?
పూనమ్ కౌర్ రాజకీయాలలోకి ప్రవేశిస్తుందా అనే చర్చలు గతంలోనూ వచ్చాయి. ముఖ్యంగా ఆమెకు రాజకీయ వ్యక్తులతో ఉన్న సంబంధాలు, ఆమె మాటల ధోరణి, సామాజిక అంశాలపై స్పందించే తీరు చూస్తే, రాజకీయాల్లోకి అడుగుపెట్టే అవకాశాలు లేకపోలేవని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుతో ఆమె భేటీ కొత్త ఊహాగానాలకు తావిచ్చింది. అయితే ఆమె మాత్రం అధికారికంగా ఏ రాజకీయ పార్టీకి చెందినట్లు ఎక్కడా ప్రకటించలేదు. కానీ రాజకీయ నేతలను కలవడం, ప్రజల సమస్యలపై మాట్లాడటం, ఆమె భవిష్యత్లో రాజకీయ రంగ ప్రవేశానికి ముంగిటలో ఉన్నారనే సంకేతాలు ఇస్తోంది.
కళా ప్రేమను వ్యక్తపరచిన పూనమ్
చంద్రబాబుకు బహుమతిగా ఇచ్చిన ఆర్ట్ వర్క్ పూనమ్ లో ఉన్న కళా ప్రేమను చాటుతోంది. ఆర్ట్ ఫీల్డ్ పై ఆమెకు ఉన్న మక్కువ ఇది మరొకసారి వెల్లడించింది. ఆమె చెప్పినట్టు అమరావతి అభివృద్ధిని ప్రతిబింబించేలా ఉన్న ఈ కళాఖండం ద్వారా రాష్ట్రాభివృద్ధిపై ఆమె అభిమానం కూడా తెలుస్తోంది.
Also Read: Sridevi: జాబిలికి అవార్డు.. మళ్ళీ ఏడిపించించేసిందిరో క్యూటీపై
సినిమాలకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చినా, సామాజిక అంశాలపై చురుకుగా స్పందిస్తూ, తన అభిప్రాయాలను ధైర్యంగా వ్యక్తం చేస్తూ, పూనమ్ కౌర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తోంది. తాజాగా చంద్రబాబుతో భేటీ, ఆర్ట్ వర్క్ బహుమతి, ఆరోగ్య చర్చలు ఇలా అన్నీ కలసి ఆమె పేరు మరోసారి మీడియాలో హైలైట్ అయింది. రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న ఆమె, భవిష్యత్లో ఏదైనా రాజకీయ నిర్ణయం తీసుకుంటే ఆశ్చర్యం ఏమాత్రం లేదు.