ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో.. రాజధాని లేని రాష్ట్రంగా ఏర్పడిందని పార్లమెంట్ లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఏపీ అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నదని గుర్తు చేశారు. ఆ సమయంలో నవ్యాంధ్రకు ఒక గుర్తింపును తెచ్చేలా కృష్ణా నది ఒడ్డున అమరావతిని అద్భుతమైన రాజధానిగా నిర్మించాలని సంకల్పించినట్లు వెల్లడించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా వచ్చి అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేశారని ఆయన వివరించారు.
రాష్ట్ర భవిష్యత్తు కోసం.. భావితరాల ప్రయోజనాల కోసం ప్రతి ఇటుకను ఎంతో పద్ధతిగా పేర్చుతూ అమరావతి నిర్మాణాన్ని ప్రారంభించామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రాజధాని నిర్మాణ పనులు వేగంగా సాగాయని గుర్తు చేశారు. కేవలం రాజధాని కోసమే వేలాది మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సుమారు 33 వేల ఎకరాల భూములను త్యాగం చేశారని కొనియాడారు. రైతుల త్యాగం అమూల్యమైనదని.. అటువంటి పవిత్ర ప్రదేశాన్ని గత ఐదేళ్ల పాలనలో భ్రష్టు పట్టించారని విమర్శించారు.
2019 ఎన్నికల తర్వాత ఒక్క వ్యక్తి గెలుపుతో ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి నెట్టబడిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం చేపట్టగానే మూడు రాజధానులు అనే కొత్త వాదనను తెరపైకి తెచ్చి ప్రజలను తీవ్ర గందరగోళానికి గురి చేశారని ధ్వజమెత్తారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో అమరావతిని నిర్వీర్యం చేయడమే కాకుండా.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుదేలు చేశారని ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ఐదేళ్ల కాలం వృథా అయిందని.. ఏపీ అభివృద్ధిలో వెనకబడిందని పేర్కొన్నారు.
అమరావతి రైతులు పడ్డ కష్టాలు.. వారు చేసిన పోరాటం వృథా పోలేదని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతికి పునర్వైభవం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతి నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. రాజధాని నిర్మాణాన్ని మళ్లీ వేగవంతం చేసి ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని మంత్రి పేర్కొన్నారు. అవాంతరాలను అధిగమించి ముందుకు వెళ్తామని చెప్పారు.
ALSO READ: అమరావతికి పార్లమెంటు ఆమోదం.. పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లుకు గ్రీన్ సిగ్నల్..