CM Chandrababu: కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం గంగూరు గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా రైతు సేవా కేంద్రంలో దాన్యం కొనుగోలు జరుగుతున్న తీరును సీఎం స్వయంగా పరిశీలించి రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో సీఎం పాల్గొని ప్రజల నుండి వినతులను స్వీకరించారు.
రెవెన్యూ సదస్సులో పాల్గొన్న సీఎం మాట్లాడుతూ.. రైతులకు ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా తక్కువేనని, రైతుల సంక్షేమం కోసం మరిన్ని పథకాలు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నష్టాల పాలు చేసిందని, తాము అందుకు భిన్నంగా రైతన్నల సంక్షేమం కోసం ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. ధాన్యం సాగుచేసిన రైతులు విక్రయించిన 24 గంటల్లోగా వారి ఖాతాలకు నగదు జమవుతున్న విషయాన్ని స్వయంగా చంద్రబాబు ప్రకటించగా, సదస్సులో పాల్గొన్న రైతులు హర్షం వ్యక్తం చేస్తూ చప్పట్లు మోగించారు.
అలాగే ధాన్యం సేకరణ సమయంలో తేమశాతం ఎక్కువగా కనిపిస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, వీటిని ఎలా అధిగమించాలో ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. ప్రతి రైతు నష్టపోకుండా వ్యవసాయాన్ని లాభసాటిగా సాగించాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని చంద్రబాబు తెలిపారు. గత ఏడాది కంటే ఈ ఏడాది 40 శాతం ఎక్కువగా ధాన్యం కొనుగోళ్లు జరిగాయని, ఇప్పటికే 3.20 లక్షల మంది రైతులనుండి 21.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యమును ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు.
గత వైసీపీ ప్రభుత్వం హయాంలో అరాచక పాలన సాగిందని, అందుకే 2024 ఎన్నికల్లో తమ ప్రభుత్వానికి అన్ని వర్గాలు మద్దతు పలికి ఘన విజయాన్ని అందించాయని సీఎం చంద్రబాబు తెలిపారు. 22ఏ పేరుతో రైతుల భూములు లాక్కున్నారని, గడిచిన ఐదేళ్లు విధ్వంసం సృష్టించిన ఘనత వైసీపీకే దక్కుతుందన్నారు. తనకు భూముల సమస్యలపై లక్షా 75 వేల ఫిర్యాదులు అందాయని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులు చర్యలు తీసుకొనేలా ఆదేశించామన్నారు.
Also Read: Rain Alert: వచ్చే 12 గంటలు జోరు వర్షాలే వర్షాలు.. ఆ జిల్లాల్లో తస్మాత్ జాగ్రత్త!
మీ భూమిపై మీ పెత్తనం ఉండాలన్న లక్ష్యంతో ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టాన్ని అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేసినట్లు సీఎం అన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వ హయాంలో పొలాల గట్ల రాళ్ళపై కూడా బొమ్మలు వేసుకున్న ఘనత జగన్ దేనంటూ సీఎం విమర్శించారు. ఎవరైనా భూమిని లాగేసుకుంటే, కఠిన చట్టాలతో వారికి సరైన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హెచ్చరించారు.