Roja Slams AP Govt: మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ చిత్తూరు జిల్లా నగరిలో ఆర్.కే రోజా నిరసనకు దిగారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఇది మెగా డీఎస్సీ కాదని.. దగా డీఎస్సీ అని విరుచుకుపడ్డారు. నీట్ కన్నా పెద్ద స్కామ్ డీఎస్సీలోనే జరిగిందని ఆరోపించారు. ఇటీవల భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సంలో కూటమి ప్రభుత్వం మోదీ భజన చేసిందని విమర్శించారు.
డీఎస్సీకి వ్యతిరేకంగా దీక్షలు చేస్తున్న వైసీపీ నేతలపై గుండాలతో దాడి చేయిస్తున్నారని రోజా ఆరోపించారు. కోడిగుడ్లు విసిరి.. విధ్వంసానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీని దగా డిఎస్సీగా మార్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని మండిపడ్డారు. నీట్ స్కామ్ కంటే మెగా డీఎస్సీ స్కామ్ చాలా పెద్దదన్న రోజా.. కేంద్రమంత్రి ఎలా బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారో లోకేశ్ కూడా అలాగే రిజైన్ చేయాలన్నారు. అర్హత లేని వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చినందుకు నైతిక బాధ్యత వహించాలని పట్టుబట్టారు.
నీటి పరీక్ష లీక్ అయిన వెంటనే దానిని రద్దు చేసి కేంద్రం మళ్లీ పరీక్ష నిర్వహించిందని రోజా గుర్తు చేశారు. తద్వారా నీట్ పై తన జవాబుదారి తనాన్ని చాటుకుందన్నారు. ఏపీ ప్రభుత్వం జవాబు దారి తనానికి పట్టుబడుతూ శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు చేస్తుంటే.. సీఎం చంద్రబాబు రౌడీలతో దాడులు చేయిస్తున్నారని రోజా అన్నారు. మాట్లాడటం కూడా రాని మంత్రులతో తమను తిట్టిస్తున్నారని విమర్శించారు.
Also Read: జియో బిగ్ ఆఫర్.. కొత్తగా రూ.550, రూ.2000 ప్లాన్లు.. ఫ్రీగా 15 ఓటీటీలు, 1000+ ఛానెళ్లు!
జగన్ దమ్ము గురించి చంద్రబాబు, లోకేశ్ కు బాగా తెలుసని రోజా అన్నారు. ఎన్ని దాడులు చేసిన వైసీపీ భయపడదని స్పష్టం చేశారు. విద్యార్థుల దెబ్బకు కేంద్రమే దిగివచ్చిందని.. అలాంటిది కూటమి ప్రభుత్వం తమ ముందు జుజుబీలని రోజా ఆరోపించారు. మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేసేవరకూ వైసీపీ వెనక్కి తగ్గేది లేదని రోజా చెప్పుకొచ్చారు.
Also Read: ప్రపంచంలోనే అతి పొడవైన జుట్టు.. గిన్నిస్ రికార్డ్ బద్దలుకొట్టిన భారతీయ మహిళ