South Central Railway New Rules: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు చేసింది. రిజర్వేషన్ ఉన్న కోచ్ లలో సరైన టికెట్ లేకుండా ప్రయాణించడం, అనుమతి లేకుండా ప్రవేశించకూడదని వెల్లడించింది. ప్రయాణికుల భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని రైల్వే నిబంధనలను కఠినతరం చేసినట్లు వెల్లడించింది. రిజర్వ్డ్ కోచ్ లలో సాధారణ టికెట్తో, సరైన అనుమతి లేకుండా ప్రయాణించే వారిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించిన ప్రయాణికులకు ఏకంగా రూ.2,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉందని దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది. ప్రస్తుతం రద్దీగా ఉండే రైళ్లలో జనరల్ టికెట్లు తీసుకున్న కొందరు ప్రయాణికులు రిజర్వేషన్ కోచ్లలోకి వెళ్లడం కనిపిస్తోంది. దీనివల్ల ముందుగానే సీట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణించే వారు సీట్ల విషయంలో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
రిజర్వేషన్ టికెట్ ఉన్న ప్రయాణికుడిని అతడి సీటులో కూర్చోకుండా అడ్డుకోవడం, ఇబ్బంది పెట్టడం కూడా నిబంధనల ఉల్లంఘనగా పరిగణించనున్నారు. ఇలాంటి సందర్భాల్లో రూ.1,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. టికెట్ ఉన్న ప్రయాణికుడికి అతని రిజర్వ్ చేసిన సీటు, బెర్త్ పై పూర్తి హక్కు ఉంటుంది. ఇతరులు ఆ సీటులో కూర్చోవడం, ఖాళీ చేయకుండా ఉండటం, ప్రయాణికుడిని అడ్డుకోవడం లాంటి చర్యలను రైల్వే అధికారులు తీవ్రంగా పరిగణించనున్నారు. అందుకే రిజర్వేషన్ లేని ప్రయాణికులు రిజర్వ్ డ్ కోచ్లలోకి వెళ్లకుండా తమకు కేటాయించిన కోచ్ లోనే ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు.
రైల్వే అధికారులు విధించిన జరిమానాను చెల్లించకుండా తప్పించుకోవాలని ప్రయత్నిస్తే సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది. జరిమానా చెల్లించని సందర్భాల్లో కేసును కోర్టుకు పంపించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాంటి సందర్భాల్లో కోర్టు ద్వారా రూ.3,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. చిన్న నిబంధన ఉల్లంఘనగా భావించి నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
రిజర్వేషన్ కోచ్ లలోకి అనుమతి లేని ప్రయాణికులు ప్రవేశించడం వల్ల రైలులో రద్దీ పెరగడంతో పాటు, రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు సీట్లు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. వృద్ధులు, మహిళలు, పిల్లలు, రాత్రి ప్రయాణించే వారికి ఇలాంటి పరిస్థితులు మరింత ఇబ్బందికరంగా మారుతాయి. ప్రయాణికుల భద్రత, సౌకర్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ నిబంధనలను అమలు చేస్తున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. ప్రయాణికులు రైలులో ఎక్కే ముందు తమ టికెట్ ఏ కోచ్కు సంబంధించినదో ఒకసారి పరిశీలించుకోవాలని సూచిస్తున్నారు. జనరల్ టికెట్ ఉన్నవారు రిజర్వేషన్ కోచ్లోకి వెళ్లకూడదని స్పష్టం చేశారు.
Read Also: విజయవాడ సహా 15 రైల్వే స్టేషన్లకు మహర్దశ.. PPP మోడల్ లో రీడెవలప్మెంట్!