Sabari Express : సికింద్రాబాద్ నుంచి వెళ్తున్న శబరి ఎక్స్ప్రెస్కు ముప్పు తప్పింది. సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో నల్లపాడు-గుంటూరు సెక్షన్ మధ్య రైలు పట్టాలపై ఉంచిన ఇనుపరాడ్డును చూసిన లోకోపైలెట్ మంజునాథ్ వెంటనే అప్రమత్తమై ట్రైన్ ను ఆపేశాడు. లేదంటే ఆ రాడ్డు విరిగి లోకో అడుగు భాగాన తగిలి మంటలు వ్యాపించే ప్రమాదం ఉందని నిపుణులు తెలుపుతున్నారు.
స్పీడు తక్కువగా ఉన్నందున ఎలాంటి అసౌకర్యం కలగకుండానే రైలును ఆపగలిగారు. ఇంజినీరింగ్ సిబ్బంది, సహాయ లోకోపైలెట్లు వెళ్లి ఆ రాడ్డును తొలగించిన అనంతరం రైలు గుంటూరు స్టేషన్కు చేరింది. దుండగులు పథకం ప్రకారమే రైలు పట్టాలపై ఇనుపరాడ్డును ఉంచినట్లు తెలుస్తోంది. రాడ్డును గుడ్డతో కట్టడంతో పాటు సిగ్నలింగ్ వ్యవస్థకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అట్టముక్కలు పెట్టారు.