Big Stories

Supremecourt : ఎర్ర గంగిరెడ్డికి సుప్రీంకోర్టులో షాక్.. తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై స్టే..

Supremecourt : వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగలింది. గంగిరెడ్డి విడుదల విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఆయనకు బెయిల్‌ మంజూరు చేయడం, కస్టడీ తర్వాత విడుదల తేదీని ఖరారు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ వివేకా కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

- Advertisement -

తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ సునీత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ ను ఇటీవల జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌లతో కూడిన వేసవి సెలవుల ధర్మాసనం విచారణ చేపట్టింది. సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ సంజయ్‌ జైన్‌ వాదనలు వినిపించారు. ఈ కేసులో ఏ-1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని, అలాగే ఆయన లొంగిపోవాలని కోరారు. ఆయన్ను జూలై 1న విడుదల చేయాలని తెలంగాణ హైకోర్టు ఏప్రిల్‌ 27న ఇచ్చిన ఉత్తర్వులు 8వ వింతను తలపిస్తున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితులు తామెప్పుడు చూడలేదన్నారు. సునీత దాఖలు చేసిన పిటిషన్‌ను సమర్థిస్తున్నామని స్పష్టం చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేస్తామన్నారు.

- Advertisement -

గంగిరెడ్డి తరఫు సీనియర్‌ న్యాయవాది దామా శేషాద్రినాయుడు వాదనలు వినిపించారు. తాము కూడా బెయిల్‌ రద్దును సవాలు చేస్తూ ఎస్‌ఎల్‌పీ దాఖలు చేశామని తెలిపారు. ఆ పిటిషన్ ఇంకా లిస్ట్‌ కావాల్సి ఉందన్నారు. అన్నీ కలిపి విచారించాలని కోరారు. దీంతో జస్టిస్‌ నరసింహ రెండు కేసులనూ శుక్రవారానికి వాయిదా వేశారు. తాజాగా ఆ కేసును విచారించిన ధర్మాసనం.. గంగిరెడ్డి విడుదల అంశంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News