AP News : అతడి తండ్రి ఏఎస్సై. అతనూ ఎస్సై జాబ్కు తెగ ట్రై చేశాడు. గ్రూప్ 1 కోసమూ అటెంప్ట్ చేశాడు. జాబ్స్ ఏవీ రాలేదు. ఒకవేళ వచ్చుంటే..? ఈ ఆలోచనే వణుకు పుట్టిస్తోంది. టెర్రరిస్టుగా మారి, సూసైడ్ బాంబర్గా ప్రజల ప్రాణాలు బలిగొనాలనే దారుణమైన స్కెచ్ వేసిన సిరాజ్ ఉదంతం తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తోంది.
పోలీస్ ఫ్యామిలీలో టెర్రరిస్ట్
రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ పేలుళ్లకు కుట్ర పన్నిన సిరాజ్.. పోలీస్ కుటుంబం నుంచి వచ్చాడు. అతని తండ్రి రెమ్మాన్ విజయనగరంలో ASIగా పనిచేస్తున్నాడు. సిరాజ్ సోదరుడు టాస్క్ఫోర్స్ కానిస్టేబుల్గా ఉన్నాడు. బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన సిరాజ్.. హైదరాబాద్లో ఉంటూ ఎస్సై జాబ్ కోసం చాలాకాలం ప్రిపేర్ అయ్యాడు. రెండు సార్లు ఎగ్జామ్ అటెంప్డ్ చేసినా సెలెక్ట్ అవ్వలేదు. ఆ తర్వాత గ్రూప్స్కు ప్రిపేర్ అయ్యాడు. 2019, 2024లో రెండుసార్లు రాశాడు. అది కూడా సక్సెస్ కాలేదు. ఇలా ఫ్యామిలీలో ఇద్దరు పోలీసులు ఉండగా.. సిరాజ్ టెర్రరిస్టులతో ఎలా చేతులు కలిపాడు? ఆ విషయం కుటుంబ సభ్యులకు తెలీలేదా? తెలిసినా డబ్బులకు ఆశపడ్డారా? అనే అనుమానం వస్తోంది.
బ్యాంకులో 42 లక్షలు.. ఎక్కడివి?
విజయనగరం సహకార బ్యాంక్లో సిరాజ్కు అకౌంట్ ఉంది. అతని కుటుంబ సభ్యులందరికీ అదే బ్యాంక్లో ఖాతాలు ఉన్నాయి. జాతీయ బ్యాంకులు కాకుండా ఇలా చిన్న సహకార బ్యాంక్లో ఖాతాలు కావాలనే తీశారా? అందరి అకౌంట్స్లో కలిపి 42 లక్షల నగదు ఉన్నట్టు గుర్తించారు. వారికి అంత డబ్బు ఎక్కడిది? సిరాజ్ అరెస్టైన వెంటనే.. డీసీసీబీ బ్యాంక్లో ఉన్న లాకర్ ఓపెన్ చేయడానికి అతని తండ్రి వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. అయితే, అప్పటికే బ్యాంకు అధికారులకు పోలీసులు లేఖ రాయడంతో ఆ లాకర్ ఓపెన్ చేసేందుకు సిబ్బంది ఒప్పుకోలేదు. ముందుగా సివిల్ డ్రెస్లో వెళ్లాడు సిరాజ్ తండ్రి. ఆ తర్వాత పోలీస్ యూనిఫామ్లో బ్యాంక్కు వెళ్లి లాకర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాడు. కానీ, NIA అధికారులు ముందుగానే హెచ్చరించడంతో బ్యాంక్ అధికారులు సిన్సియర్గా డ్యూటీ చేశారు. లాకర్ ఓపెన్ చేసేందకు రెహ్మాన్ అనుమతించలేదు. కొడుకు అరెస్ట్ అయిన బాధ కూడా లేకుండా.. అంత అర్జెంట్గా బ్యాంకు లాకర్ కోసం సిరాజ్ తండ్రి ఎందుకు వెళ్లినట్టు? ఆ లాకర్లో భారీ నగదు దాచారా? బాంబులు గట్రా ఇంకేదైనా ఉంచారా?
సౌదీ నుంచి డబ్బులు?
సిరాజ్, హైదరాబాద్కు చెందిన సమీర్, వరంగల్కు చెందిన ఫర్హాన్, యూపీకి చెందిన బాదర్తో కలిసి ఉగ్రవాద గ్రూప్ను ఏర్పాటు చేసుకున్నారు. జకీర్ నాయక్, ఇస్రార్ అహ్మద్, షేక్ యాకుబ్ జమాలి, షేక్ జావిద్ రబ్బాని ప్రసంగాలతో ప్రభావితమైన ఈ గ్రూప్.. ఏకంగా అల్ హింద్ ఇతహదుల్ ముస్లిమీన్.. సింపుల్గా చెప్పాలంటే అహిం పేరుతో ఓ రాడికల్ సంస్థను ఏర్పాటు చేశారు. ఈగ్రూప్ను దేశవ్యాప్తంగా విస్తరించి.. యువతను మతోన్మాదంవైపు ఆకర్షించాలనేది వీరి ప్లాన్. ఇదే కాన్సెప్ట్తో ముంబైలోని మత కార్యక్రమంలో పాల్గొన్నాడు. అక్కడ మరికొంత మందితో పరిచయం పెంచుకున్నారు సిరాజ్ అండ్ గ్రూప్. సౌదీలో ఉంటున్న కొందరితో లింక్ ఏర్పడింది. వారి నుంచి నిధులు సమకూరినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వారి డైరెక్షన్లో సోషల్ మీడియా సాయంతో ఐఈడీ బాంబులు తయారు చేయడం నేర్చుకున్నాడు. టిఫిన్ బాక్స్ బాంబులతో పాటుగా మానవ బాంబుల తయారీ లక్ష్యంగా సిరాజ్ పని చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
Also Read : ఆ సుఖం కోసం.. పాక్కు సీక్రెట్స్.. యూట్యూబర్ జ్యోతి కేసులో ట్విస్ట్
ఆన్లైన్ టెర్రరిజం..
సిరాజ్ అండ్ టీమ్ రెగ్యులర్గా టచ్లో ఉండేందుకు సిగ్నల్ యాప్ను వాడారు. సిగ్నల్ యాప్లో సిరాజ్-సమీర్ మధ్య చాటింగ్ బయటపడింది. బాంబుల తయారీ, పేలుళ్ల గురించి డిస్కషన్ చేసుకున్నారు. వీరికి డబ్బులు అందితే ఓ స్కూల్ పెట్టి అందులోని కెమికల్ ల్యాబ్లో ప్రయోగాలు చేయొచ్చంటూ చాటింగ్ చేశారు. ఆర్ఎస్ఎస్ నేతలను టార్గెట్ చేద్దామంటూ డిస్కషన్ చేసుకున్నారు. రాకెట్ లాంచర్ ఎలా తయారు చేయాలో తెలిసిందంటూ మాట్లాడుకున్నారు. ఇలా పెద్ద ప్లానింగ్లోనే ఉన్నాడు సిరాజ్.
విజయనగరం కుర్రాడు హైదరాబాద్ వెళ్లడం.. టెర్రరిస్టుగా తిరిగిరావడం.. నగరంలోనే ఉంటూ బాంబు తయారు చేయడం.. ఆ బాంబును టెస్ట్ చేసే క్రమంలో దొరికిపోవడం.. అంతా సంచలనమే. ఒకవేళ సిరాజ్ను సమయానికి అరెస్ట్ చేసి ఉండకపోతే..? ఎంత మంది ప్రాణాలు బలితీసుకునేవాడో…