Jyoti Malhotra : యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా, పాకిస్తాన్ ఎంబసీ అధికారి డానిష్. వారిద్దరి మధ్య యవ్వారం మామూలుగా సాగలేదు. విచారణలో సంచలన విషయాలే బయటకు వస్తున్నాయి. పాక్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లతో తనకు దగ్గరి సంబంధాలు ఉన్నాయని చెప్పింది జ్యోతి. ఇక డానిష్తో నైతే రిలేషన్ మరో రేంజ్లోనే అని తెలుస్తోంది. ఏడాదిన్నరగా అతనితో దాదాపు ప్రతీరోజూ టచ్లో ఉందట. ఆపరేషన్ సిందూర్ సమయంలోనూ డానిష్తో తరుచూ ఫోన్లో మాట్లాడినట్లు గుర్తించారు. పాక్ అటాక్ చేసినప్పుడు భారత సరిహద్దు ప్రాంతాల్లో పలు చోట్ల బ్లాకౌట్స్ నిర్వహించారు. ఏయే ఏరియాల్లో బ్లాకౌట్స్ ఉన్నాయి.. ఎక్కడెక్కడ క్లియర్ విజువల్ ఉంది అనే సమాచారం ఎప్పటికప్పుడు డానిష్కు అందజేసిందట జ్యోతి.
పాక్కు లవ్ లెటర్స్..
జ్యోతి నుంచి ఓ డైరీని స్వాధీనం చేసుకున్నారు NIA, IB అధికారులు. పాక్ ట్రిప్ తర్వాత 10 పేజీలు రాసినట్లు గుర్తించారు. అందులో మూడు పేజీలు పాక్ను తెగ పొగుడుతూ హిందీలో రాసింది జ్యోతి. పాకిస్తానీ ప్రజలు చూపిన ప్రేమను మరిచిపోలేనంటూ ఫీల్ అయింది. పాక్ ప్రజల అతిథి మర్యాదల గురించి ప్రత్యేకంగా రాసుకుంది. దాయాది దేశం క్రేజీగా, కలర్ఫుల్గా ఉన్నట్టు గొప్పగా చిత్రీకరించింది. హిందువులు కూడా పాక్లోని పురాతన ఆలయాలను సందర్శించాలంటూ రాసుకొచ్చింది. జ్యోతి తీరుపై అనేక అనుమానాలు వస్తున్నాయి. డానిష్ ఇచ్చే డబ్బు కోసం, సుఖం కోసమే స్పై గా మారిందా? లేదంటే నిజంగానే పాక్పై ప్రేమ పెంచుకుందా? అనే డౌట్ వస్తోంది.
బెంగాల్లోనూ స్పై..?
మరోవైపు, పశ్చిమ బెంగాల్లోని మన సైన్యానికి సంబంధించిన వ్యూహాత్మక ప్రాంతాల దగ్గరలో కూడా జ్యోతి మల్హోత్రా పర్యటించినట్టు తేలింది. కీలక ప్రదేశాలలో జ్యోతి షూట్ చేసిన వీడియోలు చూస్తే జాతీయ భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఫిబ్రవరిలో పశ్చిమ బెంగాల్లోని రెండు ప్రాంతాల్లో పర్యటించింది. సీల్దా స్టేషన్లో రన్నింగ్ ట్రైన్ వీడియో తీసింది. ఆ తర్వాత నార్త్ 24 పరగణాస్లోని బరాక్పూర్లోని ఓ ఫ్యామస్ బిర్యానీ రెస్టారెంట్లో కూడా వీడియోలు చేసింది. ఈ రెస్టారెంట్ ఉన్న ఏరియాకు దగ్గరలోనే ఇండియన్ ఆర్మీ స్థావరాలు ఉన్నాయి. ఆ సైనిక స్థావరాల వీడియోలు కూడా జ్యోతి షూట్ చేసిందా? లేదా? అనే దానిపై విచారిస్తున్నారు.
ఆ పెళ్లి ఎవరిది..?
హుగ్లీలోని బరాక్పూర్లో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు జ్యోతి బెంగాల్ వచ్చింది. ఆ తర్వాత వివిధ ప్రాంతాల్లో పర్యటించినట్టు గుర్తించారు. ఆమెను పెళ్లికి పిలిచిన వారిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. వారి బ్యాక్ గ్రౌండ్ చెక్ చేస్తున్నారు. ఆమె బరాక్పూర్ పర్యటనకు ఫిబ్రవరిలో వెళ్లగా.. ఆ తర్వాత నెల గ్యాప్లోనే మార్చిలో పాకిస్తాన్ వెళ్లింది. బరాక్పూర్ సైనిక స్థావరాలకు సంబంధించిన వివరాలు ఏమైనా పాకిస్తాన్కు ఇచ్చిందా? అనేదానిపై ఆరా తీస్తున్నారు.
పాక్, చైనా, బంగ్లాదేశ్.. అంతకుమించి?
జ్యోతి మల్హోత్రా ఫోన్లు, ల్యాప్టాప్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు పోలీసులు. డేటాను రిట్రైవ్ చేస్తున్నారు. మల్టిపుల్ బ్యాంకు అకౌంట్లు వాడుతున్నట్టు గుర్తించి, ఆ లావాదేవీలను పరిశీలిస్తున్నారు. జ్యోతి అకౌంట్స్ లోకి దుబాయ్ నుంచి భారీగా డబ్బులు జమ అయినట్టు గుర్తించారు. పాక్, చైనా, బంగ్లాదేశ్ పర్యటనల ట్రావెల్ హిస్టరీని సైతం పరిశీలిస్తున్నారు. ఎక్కడెక్కడ తిరిగింది..? ఎవరెవరిని కలిసింది..? అనేదానిపై ఆరా తీస్తున్నారు. మన దేశ రహస్యాలు పాక్తో పాటు చైనా, బంగ్లాదేశ్లకు కూడా రివీల్ చేసిందా..?
Also Read : కోటిన్నర రివార్డు.. ఎవరీ కేశవరావు? అగ్రనేత హతం..
అతనితో టచ్లో..
పాక్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లను కలిసింది నిజమేనని ఒప్పుకుంది యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా. పాక్ పర్యటనలో వారిని కలిసినట్లు విచారణలో తెలిపింది. ఢిల్లీలోని పాక్ హైకమిషన్ ఆఫీసర్ డానిష్ను 2023లో తొలిసారి కలిసినట్టు చెప్పింది. పాక్ వీసా కోసం వెళ్లగా డానిష్ పరిచయం అయ్యాడని, అప్పటి నుంచి టచ్లో ఉన్నట్లు వివరించింది. పాక్ వెళ్లాక డానిష్ మనిషి అలీ హసన్ను కలిశానని.. అతడు పాక్ ఇంటెలిజెన్స్ అధికారులను తనకు పరిచయం చేశాడని తెలిపింది. ఇండియా వచ్చాక కూడా హసన్తో వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్లో కాంటాక్ట్లో ఉన్నట్టు చెప్పింది జ్యోతి. వాళ్లిద్దరు జరిపిన చాటింగ్ చూసి విచారణ అధికారులు అవాక్కయ్యారు. మరోసారి పాకిస్తాన్ వచ్చినప్పుడు తనను పెళ్లి చేసుకోవాలంటూ హసన్ను జ్యోతి కోరినట్టు ఆ చాట్తో తెలిసింది.
డానిష్.. మంచి ఆటగాడు..
ఆ డానిష్ మామూలోడు కాదు. వీసాల కోసం పాక్ ఎంబసీకి వచ్చే వారిని ట్రాప్ చేసి గూఢచారులుగా మార్చేవాడని తెలుస్తోంది. పంజాబ్కు చెందిన గజాల అనే యువతిని కూడా ఇలానే గూఢచర్యానికి వాడుకున్నాడని గుర్తించారు. సైనిక స్థావరాల సమచారం ఇస్తే భారీగా డబ్బు ముట్టజెప్పేవాడని అంటున్నారు. జ్యోతి, గజాల.. ఇంకా అతని ఖాతాలో ఎంతమంది ఉన్నారనే దిశగా దర్యాప్తు జరుగుతోంది.