Corona Alert In AP: వాతావరణ మార్పుల నేపథ్యంలో కరోనా వైరస్ చాపకింద నీరుగా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా ఏపీలో మరో ఆరు కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటివరకు అక్కడ కేసుల సంఖ్య 32కు చేరింది. కరోనా కేసులు పెరుగుతుండడంతో అప్రమత్తం అయ్యింది ఏపీ ప్రభుత్వం.
ఏపీలో విస్తరిస్తున్న కరోనా- ఏపీలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా బుధవారం నాడు మరో ఆరు కేసులు నమోదయ్యాయి. అందులో మూడు తూర్పుగోదావరి జిల్లా, మరో మూడు విశాఖపట్నంలో నమోదు అయ్యాయి. ఆరు కేసులతో కలిపి ఇప్పటివరకు నమోదు అయిన కేసుల సంఖ్య 32 కి చేరింది. రోజు రోజుకూ కేసులు పెరుగుతుండడంతో వైద్య అధికారులను కాస్త కలవరపెడుతోంది.
కొత్తగా ఆరు కేసులు నమోదు- కడప జిల్లాలో సేకరించిన నమూనాల్లో ఒమిక్రాన్ ఆర్ఎఫ్.5 ఉన్నట్లు తేలడంతో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది ప్రభుత్వం. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచన చేశారు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. ప్రభుత్వాసుపత్రుల్లో ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని, కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో రెడీగా ఉందన్నారు.
ఆయా జిల్లాల ప్రజలకు అలర్ట్-ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స, పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తోంది. కరోనా విషయంలో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వివరిస్తున్నారు. ఏమైనా స్వల్ప లక్షణాలు కనిపిస్తే సమీప ప్రభుత్వాసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని చెబుతున్నారు.
ఆసుపత్రుల్లో ఏర్పాట్లు- ఏపీలోని 17 ఆసుపత్రుల్లో 255 ప్రత్యేక వార్డులను సిద్ధం చేసింది ప్రభుత్వం. సాధారణ మాస్కులు, ఎన్-95 మాస్కులు, పీపీఈ కిట్లు, అవసరమైన మందులు అందుబాటులో ఉంచింది. టెస్టింగ్ కిట్లు, రెమిడిసివిర్ను స్థానికంగా కొనుగోలు చేసేందుకు సూపరింటెండెంట్లకు అధికారాలు అప్పగించింది.
ALSO READ: దేశమంతా రుతుపవనాల జోరు.. ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు, హైదరాబాద్ మాటేంటి?
మరోవైపు కరోనాను సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి వీరపాండియన్. గత అనుభవాల దృష్ట్యా దశల వారీ కార్యాచరణ రెడీ చేయాలని సూచన చేశారు. ఇప్పటివరకు కడప జిల్లాలో ఎనిమిది కేసులు నమోదు అయ్యాయి.
గుంటూరు-6, తూర్పుగోదావరి-6, విశాఖపట్నం-3, కాకినాడ, బాపట్ల జిల్లాల్లో రెండేసి చొప్పున కేసులు నమోదు అయినట్టు తెలిపారు. ఇక పార్వతీపురం మన్యం, ఏలూరు, ఎన్టీఆర్, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్క కేసులు ఉన్నాయి. అనారోగ్య సమస్యలతో ఈ వ్యాధి బారిన పడి ఇప్పటివరకు నలుగురు చనిపోయారు. కొంతమంది హోం ఐసొలేషన్లో ఉన్నవారు కోలుకుంటున్నారు.