
Kondapi : ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాయుడుపాలెంలోని టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి ఇంటి ముట్టడికి వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరికూటి అశోక్బాబు నేతృత్వంలో ఈ కార్యక్రమం చేపట్టారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో మరుగుదొడ్ల నిర్మాణాల్లో అవకతవకలు జరిగాయని వైసీపీ నేతలు ఆరోపించారు. ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించేందుకు టంగుటూరులోని వైసీపీ కార్యాలయానికి వద్దకు భారీగా కార్యకర్తలు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితులను కంట్రోల్ చేసేందుకు
350 మంది పోలీసులను అక్కడ మోహరించారు.
మరోవైపు వైసీపీ తీరును నిరసిస్తూ టీడీపీ నేతలు కౌంటర్ గా నిరసనకు ప్రయత్నించారు.
టంగుటూరులోని వరికూటి అశోక్బాబు ఇంటి ముట్టడికి ఎమ్మెల్యే డోలా
ఆధ్వర్యంలో భారీగా టీడీపీ కార్యకర్తలు బయలుదేరారు. మార్గంమధ్యలో 16వ నంబర్ జాతీయ రహదారిపై పోలీసులు వారిని అడ్డుకున్నారు.
ఈ సమయంలో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి రోడ్డుపైనే
బైఠాయించారు. దీంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడ నుంచి తరలించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు.