Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వరుణుడి ప్రతాపం కొనసాగుతోంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల రాగల కొన్ని గంటల్లో రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు సూచిస్తున్నారు.
తెలంగాణలో ‘ఎల్లో అలర్ట్’.. ఆ జిల్లాలకు భారీ ముప్పు!
తెలంగాణపై వరుణుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు కనిపిస్తోంది. భారత వాతావరణ శాఖ (IMD) తాజా సమాచారం ప్రకారం.. రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, జగిత్యాల, సూర్యాపేట, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో ఇవాళ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వానలు పడే ఛాన్స్ ఉంది. ఈ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులు పడే ప్రమాదం కూడా ఉండటంతో వాతావరణ కేంద్రం ‘ఎల్లో అలర్ట్’ ప్రకటించింది.
ఏపీని ముంచెత్తుతున్న వానలు..
మరోవైపు ఏపీలోనూ వర్షాల జోరు తగ్గడం లేదు. ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. తీరం వెంబడి బలమైన గాలులు వీచే ప్రమాదం ఉందని, సముద్రం అలజడిగా ఉంటుందని మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
రైతన్నల్లో ఆనందం.. ప్రజలకు విజ్ఞప్తి
ఈ విస్తారమైన వర్షాలు సాగు పనులకు ఊతాన్నిస్తుండటంతో రైతన్నల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ప్రయాణాలు చేసే వారు, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు పిడుగుపాటుకు గురికాకుండా చెట్ల కింద, విద్యుత్ స్తంభాల చెంత నిలబడకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు కోరుతున్నారు. నదులు, వాగులు దాటే ప్రయత్నాలు చేయవద్దని, అత్యవసర సాయం కోసం కంట్రోల్ రూమ్ నంబర్లను సంప్రదించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Also Read: ఇకనైనా బుడ్డోడిని ఆడించు, లేకపోతే గుడ్డలు ఊడతీసి కొడతారంటూ గంభీర్ కు వార్నింగ్