Telangana SIR: ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ-SIR ప్రక్రియ తెలంగాణలో జోరుగా సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నాటికి కోటి 43 లక్షల ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేసినట్లు ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. జూలై 31న ఓటర్ల జాబితా ముసాయిదాను అధికారికంగా విడుదల చేయనుంది తెలంగాణ ఎన్నికల సంఘం.
తెలంగాణలో జోరుగా ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ
దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలు-మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ-సర్ కార్యక్రమం చేపట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. దాదాపు 36 కోట్ల మంది ఓటర్లను కలుపుకుంటూ చేపట్టిన కార్యక్రమం ఎన్నికల సంఘం మే 14న ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కసరత్తు జరుగుతోంది.
తెలంగాణలో గురువారం నుంచి ఓటర్ల జాబితా ముమ్మర సవరణ ప్రక్రియ ప్రారంభమైంది. నాలుగు రోజుల్లో 1,43,17,635 ఎన్యూమరేషన్ పత్రాలను పంపిణీ చేసినట్లు తెలంగాణ ఎన్నికల సంఘం తెలిపింది. దాదాపు ఓటర్లలో 42.33 శాతం పత్రాల పంపిణీ పూర్తి అయినట్టు పేర్కొంది. బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి వివరాలను సేకరణ చేస్తున్నారు.
నాలుగు రోజుల్లో 42 శాతం పత్రాల పంపిణీ పూర్తి, అక్టోబర్ ఒకటిన ఓటర్ల జాబితా విడుదల
అభ్యంతరాలు, క్లెయిమ్ల స్వీకరణ జరుగుతోంది. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, కొత్తగా పేర్లు నమోదు చేసుకోవాలనుకునేవారు జూలై 31 నుండి ఆగస్టు 30 వరకు గడువు ఉంది. అందిన దరఖాస్తులు, అభ్యంతరాలను పరిశీలన ప్రక్రియ జూలై 31 నుండి సెప్టెంబర్ 28 వరకు కొనసాగుతుంది. అన్ని సవరణలు పూర్తి చేసిన తర్వాత ఈ ఏడాది అక్టోబర్ ఒకటిన ఓటర్ల తుది జాబితాను ప్రచురిస్తారు.
తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఇదిలా ఉండగా ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీలో రాజకీయ పార్టీల నుంచి పలు ఫిర్యాదులు రావడం మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారు-డీఈవోలు, ఎన్నికల నమోదు అధికారులతో సోమవారం తెలంగాణ ఎన్నికల సంఘం అధికారులు సమీక్ష నిర్వహించారు.
ALSO READ: సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్యేల రిక్వెస్టులు.. ఎందుకో తెలుసా..?
కిందిస్థాయిలో బీఎల్వోలకు ఎదురవుతున్న ఇబ్బందులు, పలు ప్రాంతాల్లో నెలకొన్న గందరగోళ పరిస్థితులపై చర్చించనున్నారు. బీఎల్వోలు తమకు కేటాయించిన విధులను నిర్వహిస్తూ పత్రాలను పంపిణీ చేయడం భారంగా మారింది. దీనిపై ఎన్నికల అధికారులు సమీక్ష నిర్వహించి ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ సాఫీగా సాగేలా చర్యలు చేపట్టింది.
పనుల కోసం వెళ్లిన ఓటర్లు, తమ ఎన్యూమరేషన్ ఫారాలను ECI యాప్ ద్వారా లేదా voters.eci.in లో డిజిటల్గా సమర్పించవచ్చు. ఈ ఫారాలు నేరుగా సంబంధిత పోలింగ్ స్టేషన్, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్-ERO స్థాయిలో స్వీకరించబడతాయి. ప్రవాస భారతీయులకు ఈ ప్రక్రియ చాలా కీలకం. NRIలు ఆయా ఫారాలను ఆన్లైన్లో పూర్తి చేసి సమర్పించవచ్చు. వారి కుటుంబ సభ్యులతో పూరించి, సంతకం చేయించి BLOకి అందజేయవచ్చు.