Tirumala laddus row: తిరుమల కల్తీ లడ్డు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? ఇంతకీ దర్యాప్తు జరుగుతోందా? ఈ కేసులో అరెస్టులు ఇంకా జరుగుతున్నాయా? ఛార్జిషీటు ఎప్పుడు దాఖలు చేస్తారు? అప్పటికే టీటీడీ ఛైర్మన్లను విచారించకుండానే చివరిదశకు చేరుకుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. త్వరలో వేయనున్న ఛార్జిషీటును సీబీఐ పరిశీలనకు సిట్ అధికారులు పంపినట్టు తెలుస్తోంది.
లడ్డూ విచారణ వేగంగా
తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై సుప్రీంకోర్టు నియమించిన సిట్ దర్యాప్తు జరుపు తోంది. గడిచిన ఐదారు నెలలుగా ఎంతో మందిని విచారించారు సిట్ అధికారులు. కొందర్ని అరెస్టు చేసి జైలుకి తరలించారు. ఈ కేసులో రేపో మాపో ఛార్జిషీటు వేసేందుకు రంగం సిద్ధమైంది. సిట్ అధికారులు రెడీ చేసిన ఛార్జిషీటు, సీబీఐ పరిశీలనకు వెళ్లింది. అక్కడి నుంచి రాగానే ఈ కేసులో ఛార్జిషీటు దాఖలు చేయనుంది. ఒక్కటే ఛార్జిషీట్ ఉంటుందా? లేదా మరిన్ని ఉంటాయా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యి కల్తీకు సంబంధించి దర్యాప్తు వేగవంతం చేసింది సిట్. ఈ కేసులో బోలే బాబా డెయిరీ సీజీఎం హరి మోహన్, 15వ నిందితుడు బోలే బాబా డెయిరీకి నెయ్యి సరఫరా చేసే వ్యాపారి ఆశిష్ అగర్వాల్ను నాలుగు రోజులుగా కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తోంది.
నెయ్యి కల్తీకి సంబంధించి వ్యవహారాలు ఏ స్థాయి వ్యక్తులకు తెలుసు? ఇందులో డెయిరీ నిర్వాహకులు మాత్రమేనా? టీటీడీ పెద్దల ప్రమేయముందా? నెయ్యిలో ఎలాంటి పదార్థాలు కల్తీ చేశారు? లడ్డూలో జంతు కొవ్వు ఏ స్థాయిలో కలిసింది? నెయ్యి కల్తీ చేయమని బోలే బాబా డెయిరీ నిర్వాహకులు చెప్పారా? వాళ్లకు మరెవరైనా ఆదేశాలు పంపారా? వంటి ప్రశ్నలకు సమాధానాలు రాబట్టింది సిట్.
ALSO READ: బుట్టాకు పార్టీ ఝలక్? ఆపై ఆస్తుల వేలం?
టీటీడీ అధికారుల చేతివాటం?
కల్తీ నెయ్యి ట్యాంకర్లను పరిశీలించకుండా డబ్బు తీసుకుని పంపిన టీటీడీ ఉద్యోగులను సిట్ విచారించింది. దాదాపు 10 మంది టీటీడీ ఉద్యోగుల ప్రమేయమున్నట్లు సమాచారం. రేపో మాపో వారిని సైతం అరెస్టు చేసి ఛార్జ్షీట్ వేయనున్నారు. కల్తీ నెయ్యి కేసుకు సంబంధించిన ఛార్జ్షీట్ పేపర్స్ని సిట్ అధికారులు సీబీఐ ఉన్నతాధికారులకు పంపారు. సీబీఐ నుంచి ఆమోదముద్ర పడగానే రేపో మాపో ఛార్జ్షీట్ వేయనున్నారు.
గత ప్రభుత్వంలో తిరుమల లడ్డూ ప్రసాదాల తయారీలో నెయ్యి కల్తీపై విచారణ చేపట్టింది సిట్. తొలుత తమిళనాడులోని ఏఆర్ డెయిరీ నిర్వాహకులు, బోలేబాబా డెయిరీ నిర్వహాకులను కస్టడీకి తీసుకుని ఆధారాలు సేకరించారు అధికారులు. దాని ఆధారంగా టీటీడీ ఉద్యోగులను విచారించారు. టీటీడీ మార్కెటింగ్ ప్రొక్యూర్మెంట్ విభాగంలో పని చేసిన 20 మంది ఉద్యోగులను విచారించింది. కల్తీ నెయ్యి ట్యాంకర్లను అనుమతికి లంచాలు తీసుకున్నట్లు అంగీకరించారు. ఛార్జిషీట్లో టీటీడీ ఉద్యోగులను చేర్చనున్నట్లు తెలుస్తోంది.
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల నెయ్యి అవశేషాలున్నాయని స్వయంగా సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా సిట్ వేసింది. దీనిపై అప్పటి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ను రద్దు చేసిన సుప్రీంకోర్టు ప్రత్యేకంగా సిట్ను నియమించింది. సీబీఐ అధికారి పర్యవేక్షణలో ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది.