Butta Renuka: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటారు చాలామంది. ఈ సామెత వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుకకు అతికినట్టు సరిపోతుంది. కాకపోతే ఆమె విషయంలో సీన్ రివర్స్ అయ్యింది.. కష్టాలు మొదలయ్యాయా? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నెట్టుకుంటూ వచ్చిన ఆమె, పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయారు. ఆమె ఆస్తులు రేపో మాపో వేలానికి రంగం సిద్ధమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆమెని పక్కనపెట్టాలనే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.
అసలు మాటరేంటి?
వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుకకు గురించి చెప్పనక్కర్లేదు. దశాబ్దం కింద కర్నూలు వైసీపీ ఎంపీగా గెలిచారు. ఆపై బాగానే పాపులర్ అయ్యారు. ఇక తమకు తిరుగులేదని భావించారు ఆమె. ఈ క్రమంలో వ్యాపారాల్లోకి అడుగుపెట్టేశారు. 2018లో ఎల్ఐసీకి అనుబంధ విభాగం కంపెనీ నుంచి రూ. 310 కోట్లు అప్పు తీసుకున్నారు. 15 ఏళ్లుపాటు వాటిని చెల్లిస్తామని ఒప్పందం జరిగింది.
ఆ డబ్బుతో బెంగుళూరు, హైదరాబాద్లో భూములను కొనుగోలు చేశారు. తీసుకున్న రుణంపై కేవలం 40 కోట్లు మాత్రమే చెల్లించారు. ఇప్పుడు అసలు, వడ్డీ కలిసి 340 కోట్ల రూపాయలకు చేరింది. అయితే రుణాలు రీషెడ్యూల్ చేయాలని ఫైనాన్స్ కంపెనీలను కోరారు. అందుకు ససేమిరా అన్నాయి కంపెనీలు. ప్రతీ నెల వాయిదా రూపంలో నెలకు రూ. 3.40 కోట్లు చెల్లించాలని ఉంది.
అప్పు తీసుకున్న మాజీ ఎంపీ బుట్టా రేణుక దంపతులు తిరిగి చెల్లించలేదు. పలుమార్లు ఫైనాన్స్ కంపెనీలు నోటీసులు ఇచ్చారు. వాటికి ఎలాంటి సమాధానం లేదని తెలుస్తోంది. ఆ డబ్బులతో కొనుగోలు చేసిన భూములను వేలం వేసేందుకు సిద్ధమవుతోంది. రుణాలు చెల్లించడం ఆపేసింది. దీంతో ఎన్సీఎల్టీని ఆశ్రయించింది హెచ్ఎఫ్ఎల్. ఈ కేసు ప్రస్తుతానికి పెండింగ్ లో ఉంది.
ALSO READ: శాశ్వత రాజధాని అమరావతి, సీఎం కీలక వ్యాఖ్యలు
బుట్టా దంపతులకు బంజారాహిల్స్లో ఐదువేల గజాల ఆస్తిని రూ.145 కోట్లకు వేలం వేశారు. అయితే వాటిని కొనుగోలు చేసేందుకు ఎవరు ముందుకు రాలేదు. మాదాపూర్లోని 7 వేల గజాల్లో ఉన్న బుట్టా కన్వెన్షన్ వేలానికి సరైన స్పందన రాలేదు. ఇప్పుడు మరోసారి వేలం వేయాలని ఫైనాన్స్ కంపెనీ భావిస్తోంది.
రాజకీయాలు మాటేంటి?
2024 ఎన్నికల్లో వైసీపీ తరపున కర్నూలు ఎంపీ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు ఆమె. కాకపోతే పార్టీ హైకమాండ్ మాత్రం ఎమ్మిగనూరు టికెట్ ఇచ్చింది. టీడీపీ అభ్యర్థి చేతిలో ఆమె ఓడిపోయారు. ఆమె ఓటమికి సొంత పార్టీ నేతలే కారణమని వాదనలు లేకపోలేదు. ప్రస్తుతం ఆమె తన నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. ఈ విషయం వైసీపీ హైకమాండ్ దృష్టికి వెళ్లింది.
బుట్టా రేణుక.. హైదరాబాద్ లేదంటే బెంగుళూరులో ఉంటున్నారని, తమకు అందుబాటులో లేరని అధిష్టానం వద్దకు ఫిర్యాదులు వెళ్లాయి. ఓవైపు వ్యాపారాల్లో ఒడిదుకుడులు.. ఇంకో వైపు కార్యకర్తల నుంచి ఒత్తిడి క్రమంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ఛార్జ్ పదవి నుంచి ఆమెని తప్పించే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే బుట్టా రేణుకకు ఊహించని ఝలక్ అన్నమాట.